Nara Chandrababu Naidu : పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సక్సెస్ అయ్యింది. పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసి ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ తో భారత్ చిన్నసైజు యుద్దమే చేయాల్సి వచ్చింది. దాయాది దేశం మిస్సైల్స్, డ్రోన్ దాడులకు తిప్పికొట్టిన భారత్ ఎదురుదాడికి దిగి పాక్ కు గట్టిగానే షాకిచ్చింది. ఇలా ఉగ్రవాదం, పాకిస్థాన్ కు ఒకేసారి ధీటుగా జవాబిచ్చిన భారత విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి పార్టీలు (టిడిపి, జనసేన, బిజెపి) కూడా తిరంగ ర్యాలీని నిర్వహించాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ జెండాలు చేతబట్టి ముందునడవగా పార్టీల నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వెనక నడిచారు. ఇలా తిరంగ ర్యాలీలో మూడు కిలోమీటర్ల దూరం సాగింది.
బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ స్పందించిన తీరు అద్భుతమని... ఇకనైనా భారత్ తో ఆటలు సాగవని పాక్ గుర్తిస్తే మంచిదన్నారు. ఒకవేళ భారత్ సీరియస్ గా తీసుకుని దాడులు మొదలుపెడితే అదే పాక్ కు చివరిరోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో భారత దేశానికి సమర్ధవంతమైన నాయకుడు దొరికాడు.. ఆయన దేశ రక్షణకోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. దేశంలో ఉగ్రవాదం లేకుండా చేయాలని ఆయన సంకల్పించారని.. అందుకే ఆర్మీ యాక్షన్ లోకి దిగిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
జమ్మూ కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత బాధాకరమని అన్నారు. పహల్గాంలో భార్య ముందే భర్తను, కూతురు ముందే తండ్రిని కాల్చిచంపారు... మతాన్ని అడిగిమరి చంపేసారన్నారు. ఇలా మన ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులకు ఈ భూమిమీదే లేకుండా చేయడానికి చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం అయ్యిందని చంద్రబాబు తెలిపారు. మన జవాన్ల పోరాటాన్ని, దేశ సైనిక బలాన్ని చూసి ప్రజలంతా గర్విస్తున్నారని అన్నారు.