Weather Update: ఒకవైపు నిప్పుల కొలిమి.. ఇంకోవైపు పిడుగుల వాన ! వాతావరణంలో వింత మార్పులు.. అలర్ట్ జారీ

Published : Jun 01, 2026, 10:29 PM IST

Weather Update : ఆంధ్రప్రదేశ్ లో ఎండలు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఒకేసారి వణికిస్తున్నాయి. 40-50 కిమీ వేగంతో వీచే ఈదురుగాలుల వల్ల ప్రజలు, రైతులు సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

PREV
14
తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకేసారి ఎండలు, భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రూట్ మార్చింది. ఒకే టైమ్‌లో ఎండలు దంచికొడుతూ, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వణికిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు (మంగళవారం, బుధవారం) వాతావరణం చాలా విచిత్రంగా మారబోతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఒక పక్కన భానుడు నిప్పుల కురిపిస్తుంటే.. మరోపక్కన పిడుగులతో వర్షం విరుచుకుపడే ఛాన్స్ ఉందని ఆయన హెచ్చరించారు.

24
రుతుపవనాల ప్రభావం.. ద్రోణితో వానలు

వాతావరణంలో ఏర్పడిన ఒక భారీ ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం వానలు పడుతున్నాయి. దీనికి రుతుపవనాల ప్రభావం కూడా తోడవుతోందని సమాచారం. తూర్పు విదర్భ నుంచి ప్రారంభమై తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా దక్షిణ కేరళ వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది. 

దీని ఎఫెక్ట్ వల్ల ఏపీలో మంగళవారం, బుధవారం పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.

34
ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్

మంగళవారం ఏపీలోని పలు జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించే ఛాన్స్ ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉంది.

అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

44
ఇంకోవైపు మండే ఎండలు

వర్షాల అలర్ట్ ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఎండలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లో 40-42 డిగ్రీల ఎండలు ఉంటాయి.

సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్రీలు, మార్కాపురం నందనమారెళ్లలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వింత వాతావరణ పరిస్థితుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాన పడేటప్పుడు పొరపాటున కూడా చెట్ల కింద, కరెంట్ స్తంభాల దగ్గర, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఉండొద్దని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories