ఆ పోలీస్ కుటుంబాలకు అండగా నిలవండి..: పోలీసులతో డీజీపీ సవాంగ్

First Published Oct 29, 2021, 1:49 PM IST

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో డిజిపి గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రతి పోలీస్ అండగా వుండాలని సూచించారు. 

కోవిడ్ సమయంలో భయంతో ప్రజలంతా ఇళ్లల్లో ఉంటే, ఒక్క పోలీసు మాత్రమే రోడ్డు మీద నిలబడి ప్రజల ప్రాణాలను కాపాడారని తెలంగాణ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో 206 మంది పోలీసులు కరోనాబారిన పడి ప్రాణాలు కోల్పోయారని డిజిపి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు నివాళులర్పించడంతో పాటు, మనకు దూరమైన సాటి పోలీసు కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు డిజిపి సవాంగ్.

పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఏపీ పోలీస్ బ్యాండ్ డిస్ ప్లే నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందజేసిన బ్యాంకు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిథులకు ప్రసంశ పత్రాలు అందజేశారు.
 

కోవిడ్ సమయంలో 24X7 హెల్ప్ లైన్ తో పోలీసు కుటుంబాలకు వైద్య సేవలు అందించిన ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ సతీమణి సుమిత్రా రవిశంకర్, వారి టీమ్ ను ప్రత్యేకంగా goutham sawang అభినందించారు. పోలీసు కుటుంబానికి చెందిన వ్యక్తిగా sumitra ravishankar అందించిన సేవలు చాలా గొప్పవని ఆయన కొనియాడారు.
 

విధి నిర్వహణలో ఎంతో బాధ్యతతో వ్యవహారించే పోలీసులు ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిలబడే తమ విధులు నిర్వహిస్తారని ప్రశంసించారు. ముఖ్యంగా మహిళా పోలీసులు పనిచేసే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని.. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని పనిచేయాల్సి ఉంటుందన్నారు. అదే సమయంలో పోలీసులుపై అనేక అంచనాలు ప్రజలకు ఉంటాయని... వాటిని అందుకునే విధంగా పనిచేయాలన్నారు. 

ఒకవైపు సమాజాన్ని రక్షిస్తూనే, మరోవైపు కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంటుందన్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సమాజం కోసం పోలీసులు వారి కుటుంబాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా వస్తాయన్నారు. పోలీసులు వెనుక వారి కుటుంబాలు అండగా ఉండటం వల్లనే ఎటువంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలుగుతున్నారని... మన కోసం త్యాగం చేసిన కుటుంబాలను ఎలా కాపాడుకోవాలనేది కూడా ఆలోచించాలన్నారు. 

పోలీసు అమరవీరుల కుటుంబాలకు మద్దతుగా నిలిచి, వారికి భరోసా ఇవ్వాల్సిన బాద్యత పోలీసులందరిపైనా ఉందన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని సందర్భాల్లో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. కోవిడ్ సమయంలో అన్ని వ్యవస్థలు స్థంభించుకుపోయినా పోలీసు ఒక్కడే రోడ్లమీద ఒంటరిగా నిలబడి సమాజానికి రక్షణగా నిలబడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో 206 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 

బ్యాండ్ లు అనేవి మన సంస్కృతిలో భాగం, మన సంస్కృతికి చిహ్నాలని, వాటిని కాపాడుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.   గతంలో రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వంటి కార్యక్రమాలకు కూడా సరైన బ్యాండ్ లు ఉండేవి కాదని.. అందుకే 2014 లో 20 మందితో ఏపీ పోలీసు బ్యాండ్ ప్రారంభించామన్నారు. నేడు ఏపీ పోలీసు బ్యాండ్ డిస్ ప్లే కార్యక్రమంలో బ్రాస్, పైప్ బ్యాండ్ లు మంచి ప్రదర్శన ఇచ్చాయని, అందరిలో ఉత్సాహాం, ఆనందం రెకేత్తించేలా బ్యాండ్ ప్రదర్శన ఉందని ఆయన కొనియాడారు. 

గత ఏడాది పైప్ బ్యాండ్ ను ప్రారంభించామని... నేడు వారి ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారని, భవిష్యత్తులో బ్యాండ్ లు మరింత సమర్ధవంతంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, సీనియర్ ఐపీఎస్ అధికారులు సురేంద్రబాబు, అనురాధ, పోలీసు వెల్ఫేర్ ఓఎస్డీ రామకృష్ణ, పీ అండ్ ఎల్ నాగేంద్రకుమార్, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

click me!