
పోలవరం ప్రాజెక్టు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను వీలైనంత త్వరగా మరమ్మత్తు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారంనాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం సీఎం జగన్ అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు
డయాఫ్రంవాల్ పూర్తైతే మెయిన్ డ్యాం పనులు త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
పోలవరంతో నిర్వాసిత కుటుంబాలకు నిర్మించే పునరావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఏం జగన్ ఆదేశించారు. నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించినట్టుగా అధికారులు సీఎం కు చెప్పారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని సీఎం సూచించారు
పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులను సీఎం జగన్ పరిశీలించారు.
గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును పెంచారు. దీన్ని కూడ సీఎం పరిశీలించారు.
ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న దిగువ కాఫర్ డ్యాంను సీఎం చూశారు
పోలవరం తొలిదశ పూర్తికి నిధుల విడుదలపై కేంద్రం అంగీకరించినందని అధికారులు చెప్పారు. రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని సీఎంకు అధికారులు వివరించారు. గైడ్వాల్ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం, సీడబ్ల్యూసీ ఖరారుచేసిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం వచ్చిన సమస్యను కూడా వారికి నివేదించామని అధికారులు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టులో ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని సీఎం మండిపడ్డా,రు. గత ప్రభుత్వంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారన్నారు. దీంతో వరదనీరు ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం అభిప్రాయపడ్డారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని సీఎం చెప్పారు.
పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే కాంక్రీట్ పూర్తైందని సీఎంకు అధికారులు వివరించారు. 48 రేడియల్ గేట్లు పూర్తిస్థాయిలో బిగించిన విషయాన్ని అధకారులు చెప్పారు. రివర్ స్లూయిస్ గేట్లు పూర్తయ్యాయన్నారు.పవర్హౌస్లో సొరంగాల తవ్వకం పూర్తైన విషయాలను అధికారులు సీఎంకు తెలిపారు. అప్రోచ్ ఛానల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయన్నారు.