Heatwave Alert : బయటకు రావద్దు! దంచికొడుతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Published : Apr 04, 2026, 08:01 AM IST

Heatwave Alert : ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు మొదలయ్యాయి. శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతోందనీ, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

PREV
14
ఏపీలో నిప్పుల కొలిమి.. విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం (ఏప్రిల్ 4) రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆదివారం కూడా 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

24
జిల్లాల వారీగా వడగాళ్ల ప్రభావం

శనివారం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాలు, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం (ఏలూరు/పశ్చిమ గోదావరి పరిధి) 9, అనకాపల్లిలో 2, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 1 మండలంలో తీవ్ర వడగాలులు వీయనున్నాయి. ఇవే కాకుండా శ్రీకాకుళం (2), పోలవరం (2), అనకాపల్లి (1), కాకినాడ (2), తూర్పుగోదావరి (3), ఏలూరు (4), ఎన్టీఆర్ (1), పల్నాడు (2) మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

34
రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు

శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో అత్యధికంగా 41.8°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4°C, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9°C, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 40.5°C గా నమోదైంది. నంద్యాల జిల్లా ఆలమూరు, కడప జిల్లా బద్వేల్ ప్రాంతాల్లో 40.4°C ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం, తిరుపతి జిల్లా రేణిగుంట, విజయనగరం జిల్లా రాజాంలో 40.3°C మేర ఎండ తీవ్రత కనిపించింది. కృష్ణా జిల్లా కంకిపాడులో 40.1°C, కర్నూలు జిల్లా తోవిలో 40°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

44
మండుతున్న ఎండలు.. ప్రజలకు కీలక సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మహిళలు, చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని కోరారు. దాహంగా లేకపోయినా నీరు త్రాగాలని, ఓఆర్ఎస్ తో పాటు ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఎండలో ప్రయాణించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

Read more Photos on
click me!

Recommended Stories