
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా స్థాయిని మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మొదట్లో మీడియం బడ్జెట్ తో చేద్దామనుకున్నవారు, ఇప్పుడు రూట్ మార్చుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎదిరించింది బ్రిటిష్ పాలకులను కాబట్టి ఈ కథకు జాతీయ స్థాయి లుక్ వచ్చేలా మెరుగులు దిద్దుతున్నారు. అదేసమయంలో విఎఫ్ఎక్స్, ఇతర గ్రాఫిక్స్ కాస్త హై స్టాండర్డ్ లో వుండేలా ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్లు దాటేస్తోంది.
అందువల్ల ఈ సినిమాను, తమిళ, హిందీ భాషల్లోకి కూడా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల బడ్జెట్ కు, మార్కెట్ కు వెసులుబాటు కలుగుతుంది. అదే సమయంలో అక్కడి ప్రేక్షకులకు కూడా ఆసక్తి కలిగేలా, ఆయా భాషల నటులను తీసుకోవాలని భావిస్తున్న టీమ్ కాస్త పేరున్న నటులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ పేరు ఖరారైనట్లు వినిపిస్తోంది. తమిళ, హిందీ క్యారెక్టర్ యాక్టర్ల నుంచి జనాల్లో క్రేజ్ వున్నవారిని కీలక పాత్రలకు ఎంపిక చేయాలని చూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా మంచి వసూళ్లే సాధించింది. ఆ సినిమా అంటే ఎలా వుంటుందో ప్రేక్షకుల స్పందన తెలియని నేపథ్యంలో చేసారు. ఇప్పుడు వంద కోట్ల వరకు స్పందన వుంటుంది అని క్లియర్ అయింది కనుక, ధైర్యంగా ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్తున్నారు. పైగా బాహుబలి తరువాత తెలుగు సినిమాల మీద ఉత్తరాది సినీ ప్రేక్షకులకు కాస్త ఆసక్తి పెరిగిందని భావిస్తున్నారు. అందుకే ఉయ్యాల వాడ కూడా భారీ సినిమాగా మారబోతోంది. మొత్తం మీద బాహుబలి ఎఫెక్ట్ తెలుగు సినిమాల మీద బాగానే పడింది.