
ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ దూరమవ్వగా.. రీసెంట్ గా మరో స్టార్ ప్రొడ్యూసర్ ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయాడు.
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి చెందారు. గుండె పోటుతో హైదరాబాదులో ఆయన తుదిశ్వాస విడిచారు. 66 ఏళ్ల వయస్సులో బోసుబాబు తుదిశ్వాస విడిచారు. దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావుకు బోసుబాబు బంధువు అవుతారు.
దాసరి భార్య దివంగత సినీ కార్మిక నేత పద్మకు బోసుబాబు సోదరుడి వరుస అవుతారు. మొదట్లో దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన బోసుబాబు... ఆ తర్వాత దాసరి ఆశీస్సులతోనే నిర్మాతగా మారారు. అప్పటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించారు బోసుబాబు.
అక్కినేని నాగేశ్వరరావుతో రాగదీపం, నాగేశ్వరరావు, కృష్ణలతో ఊరంతా సంక్రాంతి, కృష్ణతో ప్రజాప్రతినిధి, శోభన్ బాబుతో జీవనరాగం, దాసరి నారాయణరావుతో పోలీస్ వెంకటస్వామి సినిమాలను నిర్మించారు. బోసుబాబుకు భార్య, నలుగులు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.