
దర్శక దిగ్గజం కే విశ్వనాథ్ ఫిబ్రవరి 2న పరమపదించారు. సినిమా అంటే కళ అని వందశాతం నమ్మిన దర్శకుడిగా విశ్వనాథ్ అజరామరమైన చిత్రాలు తీశారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. మరుగున పడుతున్న మన సంస్కృతికి, కళలకి తన సినిమాలతో ప్రాచుర్యం కల్పించి బ్రతికించారు. ఆయన సినిమాకు, సాహిత్యానికి, కళలకు చేసిన సేవ మరువలేనిది.
ఈ క్రమంలో ఆ మహానుభావుడికి ఘన నివాళి ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు నిర్ణయించుకున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా 'కళాంజలి' పేరుతో కే విశ్వనాథ్ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా కళాతపస్వి సినిమాల్లో నటించే అవకాశం దక్కిన, ఆయన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటులు తప్పక హాజరయ్యారు. ఆయన కీర్తి కొనియాడారు. ఆ దర్శక శిఖరంతో తమ అనుభవాలు పంచుకున్నారు.