కరోనాతో తెలుగు దర్శకుడు మృతి!

By Surya PrakashFirst Published Apr 26, 2021, 1:44 PM IST
Highlights

 కోవిడ్-19తో హైదరాబాద్ గచ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు.


తెలుగు సినీ పరిశ్రమ మరో దర్శకుడుని కోల్పోయింది. దర్శకుడు, రచయిత ఎన్. సాయి బాలాజీ ప్రసాద్ (ఎన్. వర ప్రసాద్ ) కోవిడ్-19తో హైదరాబాద్ గచ్చిబౌలి లోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకుడిగా సాయి బాలాజీ ప్రసాద్ పనిచేశారు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. 

అలాగే కెరీర్ ప్రారంభంలో రచయితగా పనిచేసారు.కొన్ని సినిమాలకు సహ రచయితగానూ, స్క్రీన్ ప్లే వైపు పనిచేసారు. మంచి స్పార్క్ ఉన్న వ్యక్తిగా ఆయన్ను సహచరులు పేర్కొంటారు. మెగాస్టార్ హీరోగా నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ”బావగారు బాగున్నారా" చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో ఒకరు. తిరుపతి ఆయన స్వస్థలం. రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో తర్ఫీదు పొందారు. సాయి బాలాజీ ప్రసాద్ కి భార్య గౌరీ, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. సినిమా, టివి రంగాలకు చెందిన పలువురు సంతాపం తెలిపారు.
 

click me!