వరుస విజయాలతో ఉన్న సూర్య.. ఇప్పుడు ఓ భారీ చిత్రంతో రాబోతున్నారు. శివ దర్శకత్వంలో ఆయన సూర్య 42 పేరుతో రూపొందుతున్న చిత్రంలో యుద్ధ వీరుడిగా కనిపించబోతున్నారు. తాజాగా దీనికి టైటిల్ని ప్రకటించారు.
కోలీవుడ్ స్టార్ సూర్య.. తెలుగు ఆడియెన్స్ కి కూడా దగ్గరైన హీరో. ఆయనుంచి వస్తోన్న సినిమా తెలుగులోనూ విడుదల కావాల్సిందే. తమిళం తర్వాత ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా విజయాలు సాధిస్తుంటాయి. తాజాగా ఆయన ఓ విరోచితమైన కథతో వస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి తాజాగా టైటిల్ని ప్రకటించారు. `కంగువ` అనే పేరుని ఫైనల్ చేశారు. ఈ మేరకు టైటిల్ని అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్ని విడుదల చేయగా, అది ఆద్యంతం గూస్బంమ్స్ తెప్పించేలా ఉంది.
సూర్య ఇందులో గతంలో ఎప్పుడూ కనిపించనటువంటి పాత్రలో కనిపించబోతున్నారు. యుద్ధ వీరుడిగా ఆయన ఇందులో నటిస్తున్నట్టు తెలుస్తుంది. `కంగువ` అంటే అగ్ని శక్తి ఉన్న యోధుడు, శక్తివంతమైన పరాక్రమవంతుడు అని అర్థం. ఇందులో సూర్య అగ్ని శక్తి కలిగిన పరాక్రమవంతుడిగా మనల్ని కనువిందు చేయబోతున్నారు. శివ అండ్ టీమ్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతుంది. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది.
స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుండగా, యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని పది భాషల్లో భారీ పాన్ ఇండియా చిత్రంగా 3డీలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. తాజాగా విడుదల చేసిన టైటిల్ మోషన్ పోస్టర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంది.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెలల్లో మిగిలిన షూటింగ్ని పూర్తి చేయనున్నట్టు టీమ్ వెల్లడించింది. భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతుందని, అన్ని వర్గాల ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టీమ్ వెల్లడించింది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు, సీజీ వర్క్, వీఎఫ్ ఎక్స్ భారీగా ఉంటాయని, దీంతో పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ సమయం పడుతుందని తెలిపింది.