
సుప్రసిద్ధ నటుడు , సూపర్కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే ఆయన భౌతికకాయాన్ని మంగళవారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలని అనుకున్నారు. కానీ రాత్రికి నానక్రామ్గూడలోని నివాసంలోనే కృష్ణ పార్ధివ దేహాన్ని వుంచనున్నారు. బుధవారం ఉదయం పద్మాలయా స్టూడియోకి కృష్ణ భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానులను అనుమతించనున్నారు.
ఇకపోతే.. కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కేసీఆర్.. ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు. ఇక, కృష్ణ అంత్యక్రియలను బుధవారం నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ప్రస్తుతం నానక్రామ్ గూడలోని నివాసంలో కృష్ణ భౌతికకాయాన్ని ఉంచారు. అక్కడ పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.
ALso REad:ముగిసిన తొలితరం స్టార్స్ శకం..!
కాగా.. గుండెపోటు రావడంతో హీరో కృష్ణను నిన్న తెల్లవారుజామున కుటుంబసభ్యులు హైద్రాబాద్ కాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున మరణించారు.గుండెపోటు కారణంగా శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని వైద్యులు చెప్పారు. ఇవాళ ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రి నుండి కృష్ణ పార్థీవదేహన్ని కుటుంబసభ్యులు నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు.