హీరోగా మెప్పించిన శివాజీ.. సినిమాలకు గ్యాప్ తీసుకుని రాజకీయాలవైపు వెళ్లారు. అక్కడ సక్సెస్ కాలేని ఆయన మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
నటుడు శివాజీ చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలతో మెరుస్తూ, కొన్ని నెగటివ్ రోల్స్ చేస్తూ అలరించారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోగా టర్న్ తీసుకుని ఆకట్టుకున్నాడు. లవ్ స్టోరీలతో మెప్పించి, కామెడీ చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. స్టార్ హీరో ఇమేజ్ని తెచ్చుకున్నాడు.
`మిస్సమ్మ`, `అమ్మాయి బాగుంది`, `మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి`, `కొంచెం టచ్లో ఉంటే చెబుతాను`, `టాటా బీర్లా మధ్యలో లైలా`, `సత్యభామ`, `మా ఆయన చంటి పిల్లాడు`, `కౌసల్య సుప్రజ రామా`, `తాజ్ మహల్` వంటి చిత్రాలతో ఒకప్పుడు హీరోగా ఆయన పీక్ కెరీర్ని చూశాడు. కానీ ఆ తర్వాత డౌన్ అయ్యింది. హిట్లు పడకపోవడం, కొత్త హీరోల రోజు ఊపందుకోవడంతో శివాజీ కాస్త డల్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాలకే గుడ్ బై చెప్పాడు.
రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఇటీవల బిగ్ బాస్ షోతో మళ్లీ కమ్ బ్యాక్ కావాలనుకున్నారు. బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత హాట్ టాపిక్గా మారాడు. ఆయన బోల్డ్ కామెంట్లు వైరల్ అయ్యాయి. పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసే విషయంలో, రాజకీయాలపై ఆయన బోల్డ్ కామెంట్లతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఆయన `90మిడిల్ క్లాస్` అనేవెబ్ సిరీస్లో నటించి ఆకట్టుకున్నాడు. హిట్ అందుకున్నారు.
ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన `కూర్మనాయకి` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. నేడు శివాజీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పాత్రని పరిచయం చేసింది టీమ్. ఇందులో ఊరి పెద్దగా, ఓ శక్తివంతమైన పాత్రలో శివాజీ కనిపించబోతున్నారు.
భారీ సోషియో ఫాంటసీగా `కూర్మనాయకి` సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్నారు.
`మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా "కూర్మనాయకి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నాం` అని టీమ్ తెలిపింది.