
సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘2.0’ ఆడియో విడుదల ఫంక్షన్ అక్టోబర్ 27న జరగబోతోంది. దుబాయ్ లో ప్రసిద్ధిగాంచిన బుర్జ్ ఖలీఫా టవర్స్ వద్ద ఉన్న బుర్జ్ పార్క్ లో ఈ ఆడియో ఫంక్షన్ ను అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. బుర్జ్ ఖలీఫాలో ఒక భారతీయ సినిమా ఆడియో ఫంక్షన్ జరగడం ఇదే మొదటిసారి.
అంతేకాకుండా ఈవేదిక నుండి మ్యూజిక్ డైరక్టర్ రెహ్మాన్ లైవ్ షో కూడ ఇవ్వబోతున్నాడు. ఇలా ఎన్నో హంగులు ఆర్భాటాల మధ్య ‘2.0’ పాటలు అట్టహాసంగా విడుదలకాబోతున్నాయి. కేవలం ఈ ఒక్క ఈవెంట్ కోసమే సుమారు 10కోట్ల రూపాయలను ఖర్చు చేయడం దక్షిణాది సినిమా రంగంలో హాట్ న్యూస్ గా మారింది. ఈ ఆడియో ఫంక్షన్ కు ఇండియా నుండి అతిధులను ప్రత్యేకంగా తీసుకు వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో రెండు చిన్న సినిమాలు తీసే బడ్జెట్ తో ఒక ఆడియో ఫంక్షన్ నిర్వహించడం సంచలనంగా మారింది.
ఈసినిమాలోని ఒక పాట చిత్రీకరణ కోసం శంకర్ 32 కోట్లు ఖర్చు పెట్టడం అత్యంత సంచలనంగా మారింది. ఇండియా అనే కాదు ప్రపంచంలో కూడ ఇప్పటి వరకు ఏ భాషలోను ఒక సినిమా పాటకు సంబంధించి 32 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు అని అంటున్నారు. దీనితో ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన పాటను తీసిన ఘనత శంకర్ కు దక్కింది. ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తూ భారీ స్థాయిలో రోబోలను చూపిస్తూ వాటి మధ్య రజినీ అమీ జాక్సన్ల మీద ఈ పాట తీసినట్లు సమాచారం.
ఇప్పటిదాకా 'ధూమ్-3' సినిమాలోని ఒక పాటకు 5 కోట్లు ఖర్చు చేయడమే ఒక రికార్డు అనుకుంటే దానికి ఆరు రెట్లకు పైగా ఖర్చుతో '2.0'లో ఈపాట ఉండబోతోంది. ఈసినిమా కోసం సంగీత దర్శకుడు రెహమాన్ ఐదు పాటలు రికార్డ్ చేసినప్పటికీ సినిమాలో కనిపించేది రెండు పాటలే అని అంటున్నారు. మిగతా పాటలూ పెడితే నిడివి పెరిగిపోతుందని భావించి రెండు పాటలకే పరిమితం చేశాడట శంకర్. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘2.0’ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయాలని శంకర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.