ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మరి ఇంతకి ఏం జరుగుతుందంటే?
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సక్సెస్ కోసం పోరాడుతున్నారు. `ఇస్మార్ట్ శంకర్` ఇచ్చిన సక్సెస్ ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత వచ్చిన `స్కంధ` పెద్ద దెబ్బ వేసింది. బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్లతో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఇస్మార్ట్ తో హిట్ కొట్టాలని మరోసారి పూరీ జగన్నాథ్తో కలిశారు. `డబుల్ ఇస్మార్ట్` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా జరుగుతుంది. మరో మూడు పాటలు, కొంత టాకీ పార్ట్ షూట్ చేయాల్సి ఉందట.
ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ పోతినేనికి సంబంధించిన ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. ర్యాపో ఇప్పుడు కొత్త మాధ్యమంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త టాలీవుడ్ని ఊపేస్తుంది. చిన్న హీరోలు, యాక్టర్స్ ఓటీటీలో వెబ్ సిరీస్లు చేస్తున్నారు. బాలీవుడ్లో పెద్ద హీరోలు కూడా ఓటీటీ ఫిల్మ్స్, సిరీస్లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ తెలుగులో ఇంకా అలాంటి వాతావరణం రాలేదు. కేవలం వెంకటేష్, రానాలు మాత్రమే ఓటీటీ వెబ్ సిరీస్లో మెరిశారు. కానీ చాలా వరకు మంచి మార్కెట్ ఉండి, ఇమేజ్, క్రేజ్ ఉన్న హీరోలు ఎవరూ ఆ దిశగా వెళ్లడం లేదు. ఆ సాహసం చేయడం లేదు. చిన్న హీరోలు కూడా ఓటీటీకి దూరంగానే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా రామ్ పోతినేని పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ లోకి రామ్ ఎంటర్ అవుతున్నారని, అన్ని కుదిరితే ఆయన వెబ్సిరీస్ చేయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇదంతా ప్రాథమిక దశలోనే ఉన్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ నిర్వహకులు రామ్తో ఓ భారీ వెబ్ సిరీస్ని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసమే ప్రస్తుతం ఆయనతో టాక్స్ జరుగుతున్నాయట. రామ్ దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట. ఓటీటీలో రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది మిస్టరీగా మారిన నేపథ్యంలో రామ్ సైతం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.
ఓటీటీలో పవర్ఫుల్ కంటెంట్ మాత్రం బాగా ఆదరణ పొందుతుంది. కానీ అది పెద్ద హీరోలకు చాలా ఫ్యాక్టర్స్ లో రిస్క్ కూడా. బాలీవుడ్ తరహాలో మన వద్ద ఆ కల్చర్ వస్తే చేయడంలో సమస్య ఉండదు. మరి రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. కానీ ఇప్పుడీ వార్త మాత్రం అటు ఫిల్మ్ నగర్,ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.