
రామ్గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే. ముఖ్యంగా ఆయన చేసే ట్వీట్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వైరల్ అవుతుంటాయి. ఏపీలో సినిమా టికెట్ల విషయంలో నెలకొన్ని వివాదం, సమస్యపై రామ్గోపాల్ వర్మ సీరియస్గా స్పందించారు. జనరల్గా ఆయన సమస్యలపై సెటైరికల్గా స్పందిస్తుంటారు. ఫన్నీవేలోనే కామెంట్లు పెడుతుంటారు. కానీ ఏపీ టికెట్ల విషయంలో మాత్రం ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. పేర్నినాని, ఏపీ సీఎం జగన్ టార్గెట్గా గత నెలలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు.
అనంతరం చిరంజీవి.. సీఎం జగన్తో చర్చలు జరపడం, ఇప్పుడు గురువారం మరోసారి సినీ పెద్దలు చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్నారాయణమూర్తి, పోసాని, అలీ, నిరంజన్రెడ్డిలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి బాటలు వేశారు. దీనికి సంబంధించిన జీవో త్వరలోనే రానుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రామ్గోపాల్ వర్మ స్పందించారు. సీఎం జగన్పై ప్రశంసలు కురిపించారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అది కూడా సెటైరికల్గానే చెప్పడం విశేషం.
ట్వీట్టర్ ద్వారా రామ్గోపాల్ వర్మ స్పందిస్తూ, నిన్న(గురువారం) ఏపీ సీఎంతో భేటి వీడియోని పంచుకుంటూ సూపర్, మెగా, బాహుబలి లెవల్ బెగ్గింగ్ వల్ల ఇది జరిగినప్పటికీ వైఎస్ జగన్ ఒమేగా స్టార్ అయి వారిని ఆశీర్వదించినందుకు సంతోషిస్తున్నా. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలులైన జగన్ని అభినందిస్తున్నా` అని ట్వీట్ చేశారు వర్మ.
అయితే ఇందులోనూ సినీ పెద్దలకు చురకలు అంటించారు. సూపర్ స్టార్, మెగాస్టార్, బాహుబలి లాంటి పెద్దలంతా వెళ్లి సీఎం జగన్ వద్ద బెగ్ చేశారని విమర్శించడం గమనార్హం. అయితే దీనిపై నెటిజన్లు ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారు. వర్మ టార్గెట్గా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఏం చేతకానీ వాడివని విమర్శలు చేయడంతో ఇప్పుడు వర్మ ట్వీట్ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే వర్మ కామెంట్ చేయడానికి కారణం తనకు ఆహ్వానం లేకపోవడమే అనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు మంత్రి పేర్నినానితో వర్మ చర్చలు జరిపారు. ఆయనతో తీవ్ర స్థాయిలో డిబేట్ చేశారు. ఒకానొక దశలో రామ్గోపాల్ వర్మనే ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారని అంతా ప్రశంసలు కురిపించారు. కానీ తీర అసలు చర్చల టైమ్లో ఆయనకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేకపోవడం గమనార్హం. బహుశా వర్మ దీన్ని మనసులో పెట్టుకుని సినీ పెద్దలు బెగ్గింగ్ అంటూ విమర్శించి ఉంటారని అంటున్నారు.