
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ మరో వివాదానికి తెరలేపారు. నేడు యూనివర్సిటీలో అకడమిక్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ వ్యాఖ్యానించారు.
చనిపోయాక స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని.. కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయాలంటూ కామెంట్ చేశారు ఆర్జీవీ. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలని.. స్త్రీ జాతికి తానే దిక్కవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగున్నర లక్షల ధారావి ప్రజలు ఒకవైపు.. కత్రినా కాళ్లు ఒకవైపుంటే కత్రినా కాళ్లకే తన ఓటని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. పశువులకు వున్న స్వేచ్ఛ మనుషులకు లేదని ఆయన పేర్కొన్నారు. తాను యానిమల్ లవర్ని కాదని.. అందమైన అమ్మాయిల జాతిని మాత్రమే ప్రేమిస్తానని రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయిన తర్వాత ప్రపంచమంతా మరో క్షణంలో అంతమైపోయినా తాను లెక్కచేయనన్నారు. తన కోసమే తాను బ్రతుకుతున్నానని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
అయితే వర్మ వ్యాఖ్యలను ఖండించకపోగా.. వత్తాసు పలికారు వీసీ రాజశేఖర్. అంతేకాదు వర్మ ఒక ప్రొఫెసర్, ఫిలాసఫర్ కంటే ఎక్కువని ప్రశంసించారు. వర్మకు పీహెచ్డీ, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు వున్నాయన్నారు. రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ వ్యాఖ్యలతో వర్సిటీ మహిళా ఉద్యోగులు విస్తుపోయారు.