
ఎప్పటిలాగే సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. చెన్నై నుంచి విమానంలో ఆయన బయల్దేరి వెళ్లారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నారు. ఉత్తరాఖండ్ మీదుగా హిమాలయాలకు వెళ్లడానికి ఆయన చెన్నై నుంచి విమానంలో బయలుదేరి డెహ్రాడూన్ చేరుకున్నారు. ఆయన డెహ్రాడూన్ విమానాశ్రయంలో, ఏఎన్ఐతో తన ఆధ్యాత్మిక ట్రిప్ గురించి స్పందించారు.
ప్రతి సంవత్సరంలా ఆధ్యాత్మిక యాత్రకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రతిసారి తన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నానన్నారు. ఈసారి కూడా కొత్త అనుభవాలు ఉంటాయని భావిస్తున్నానని రజనీకాంత్ అన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మక భావం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని రజనీకాంత్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలు దేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళతానని.. ఇప్పుడు కూడా బద్రీనాథ్, కేదార్నాథ్లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీ తప్పుకున్నారు. అలాగే, రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, బాబాజీ గుహతో సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ సినిమాలో తన భాగం షూటింగ్ ని పూర్తి చేశారు రజనీ. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.