
`ఆర్ఆర్ఆర్` సినిమా సాధించిన ఘనతల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతిష్టాత్మకంగా భావించే `ఆస్కార్` అవార్డు ఈ సినిమాకి రావడం అందరిని ఆనందంలో ముంచెత్తింది. ఇక దాన్ని మించిన ఆనందం, దాన్ని మించిన ఘనత మరోటి లేదనేది అందరి భావన. తాజాగా మరో ఘనత `ఆర్ఆర్ఆర్` టీమ్ సాధించడం విశేషం. ఈ సినిమాకి పనిచేసిన ఆరుగురు సభ్యులకు `ఆస్కార్` నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాదికి ఆస్కార్కి సంబంధించిన కొత్తగా ఎంపిక చేసిన సభ్యుల జాబితాలో మన `ఆర్ఆర్ఆర్` టీమ్ సభ్యులు ఉండటం విశేషం.
ఇందులో ఎన్టీఆర్, రామ్చరణ్, కీరవాణి, చందబ్రోస్, సెంథిల్, సాబు సిరిల్ ప్రముఖంగా ఉన్నారు. వీరితోపాటు దర్శకుడు మణిరత్నం, అలాగే హిందీ నుంచి కరణ్ జోహార్, సిద్ధార్థ్ రాయ్లు ఆస్కార్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. వీరికి సెలబ్రిటీల నుంచి అభినందనల వెల్లువ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి సైతం తన టీమ్కి అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా తమ విషెస్ని అందించారు రాజమౌళి.
`ఈ ఏడాది అకాడమీ అవార్డుల కోసం మా `ఆర్ఆర్ఆర్` బృందంలోని ఆరు మంది సభ్యులు.. ఆస్కార్ కమిటీ సభ్యులుగా ఆహ్వానించబడినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తారక్, చరణ్, పెద్దన్న, సాబు సర్, సెంథిల్ అండ్ చంద్రబోస్ లకు నా అభినందనలు. అలాగే ఈ ఏడాది ఆహ్వానం అందుకున్న భారతీయ సినిమా సభ్యులందరికి నా ప్రత్యేక అభినందనలు` అని ట్వీట్ చేశారు రాజమౌళి. తన హ్యాపీనెస్ని ఈ సందర్భంగా ఆయన షేర్ చేసుకున్నారు. అయితే ఇంత మందికి వచ్చిన ఇండియన్ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి ఆహ్వానం లేకపోవడం గమనార్హం.
`ఆర్ఆర్ఆర్` సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. రామ్చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఆస్కార్ గెలుచుకున్న `నాటు నాటు` పాటని చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ ఆలపించారు. ఈ పాటకి గానూ ఒరిజినల్ ఆంగ్ విభాగంలో ఆస్కార్ వరించింది. ఈ సినిమా గతేడాది మార్చి 25న విడుదలైన విషయం తెలిసిందే. సినిమా ఏకంగా రూ1200కోట్ల కలెక్షన్లని రాబట్టింది.