
ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్. బి. చౌదరి కన్నుమూశారు. ఉదయపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఈ ఆకస్మిక ఘటనతో ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. దశాబ్దాల పాటు పరిశ్రమకు సేవలందించి ఆయన మరణం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చినట్టు అయ్యింది.
ఆర్. బి. చౌదరి పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. సినీ రంగంలోకి రాకముందు ఆయన రకరకాల వ్యాపారాలు చేశారు. ఉక్కు , గోల్డ్ బిజినెస్ లలో ఆయనకు మంచి పట్టు ఉంది. 1989లో సినిమా రంగంలో అడుగుపెట్టిన చౌదరి. మొదట మలయాళంలో కొన్ని సినిమాలను. అనంతరం సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ను స్థాపించి, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలను నిర్మించారు.
తన కెరీర్లో దాదాపు 99 సినిమాలను నిర్మించిన ఆర్. బి. చౌదరి, ప్రస్తుతం 100వ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం "మకుటం" పేరుతో తెరకెక్కుతుండగా, ఇందులో హీరోగా విశాల్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిర్మాణ దశలో ఉంది. ఆయన మరణంతో ఈ ప్రాజెక్ట్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగులో ఫ్యామిలీ ఓరియోంటెడ్ మూవీస్ కు ఆయన కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. "పుదు వసంతం" సినిమాను తెలుగులో "నవ వసంతం" పేరుతో విడుదల చేసి టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుస విజయాలను అందించారు.ఆయన నిర్మించిన తెలుగు చిత్రాలలో "సుస్వాగతం", "సూర్యవంశం", "రాజా", "శీను", "నువ్వు వస్తావని", "సింహరాశి", "నిన్నే ప్రేమిస్తా", "సంక్రాంతి", "అందాల రాముడు", "అన్నవరం", "రచ్చ", "గోరింటాకు", "ఇష్క్", "గాడ్ ఫాదర్" వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల ద్వారా ఆయన ఎంతోమంది దర్శకులు, నటీనటులను పరిశ్రమకు పరిచయం చేశారు.
ఆర్. బి. చౌదరికి సురేష్, జీవన్, జితన్ రమేష్, జీవా అనే నలుగురు కుమారులు ఉన్నారు. వీరిలో సురేష్ తన తండ్రి బాటలో నిర్మాతగా కొనసాగుతున్నారు. జీవన్ కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. జితన్ రమేష్ 2010లో "విద్యార్థి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన సోదరుడితో కలిసి వ్యాపారంలో నిమగ్నమయ్యారు. చివరి కుమారుడు జీవా తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఆర్. బి. చౌదరి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యాక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలొ ఆయనకు నివాళులు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఆయన చేసిన సేవలు, నిర్మించిన చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు పేర్కొంటున్నారు.
ఆర్ బి చౌదరిమరణంపై ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన రిలీజ్ చేసిన సంతాప సందేశంలో ఏముందంటే? ''ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అన్నారు.