
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన 'సంచారమే' పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘ఎపిక్’ టీజర్ మొత్తం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కథ చుట్టూ తిరుగుతూ, ఒక మంచి ఫీల్ ఇచ్చింది.
'బేబీ' సినిమా తర్వాత ఈ జోడీకి అభిమానులు తయారయ్యారు. ఈ జంట మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తే చూడాలని ఆశపడ్డారు. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ మరోసారి స్క్రీన్పై మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యింది. '90s' వెబ్ సిరీస్తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. లండన్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథలా కనిపిస్తోంది. ఆధునిక సంబంధాలు, లవ్, ఎమోషన్స్ ను ఈ సినిమాలో అద్భుతంగా చూపించనున్నారు.
ఈ కథలో ఆనంద్ దేవరకొండ ఇంట్రోవర్ట్ పాత్రలో కనిపిస్తే, వైష్ణవి చైతన్య పూర్తి ఎక్స్ట్రోవర్ట్ గా అదరగొట్టనుంది. ఇద్దరి మధ్య లిప్లాక్ సీన్లు, బోల్డ్ రొమాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రొమాంటిక్ హీరోగా విజయ్ దేవరకొండకు మంచి పేరుంది. ఇప్పుడు తమ్ముడు ఆనంద్ కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడు.
హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో జరిగిన 'ఎపిక్' టీజర్ రిలీజ్ ఈవెంట్లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడారు. 'ఆదిత్య హాసన్ ఈ కథ చెప్పినప్పుడు, నా కథే నాకు చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే నేను కూడా విదేశాల్లో చదువుకున్నా. ఈ కథలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. సితార ఎంటర్టైన్మెంట్స్లో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. జెర్సీ, టిల్లు, మ్యాడ్ లాంటి హిట్ల సరసన ఎపిక్ కూడా చేరుతుంది' అని అన్నారు.
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, ''సంచారమే' పాటకు మీరు చూపించిన ప్రేమకు థ్యాంక్స్. 'ఎపిక్' కథ నాకు బాగా నచ్చింది. నేను చేసిన 'కడలి' పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి' అని చెప్పారు.