
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ప్రభాస్, పూజా హెగ్డే కూడా రాధేశ్యామ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రభాస్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి బాహుబలి 3 ప్రస్తావన వచ్చింది. దీనికి ప్రభాస్ ఇచ్చిన సమాధానం ఆసక్తిగా మారింది.
రాజమౌళి, నేను మంచి స్నేహితులమని అందరికి తెలిసిందే. కలిసిన ప్రతి సారీ సినిమాల గురించి మాట్లాడుకుంటాం. రానున్న రోజుల్లో అందరూ కోరుకునే విధంగా ఎదో ఒకటి జరుగుతుంది. నాకు రాజమౌళికి బాహుబలిని విడిచిపెట్టడం ఇష్టం లేదు. ఎవరికి తెలుసు.. ఏమైనా జరగొచ్చు అంటూ బాహుబలి 3పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సో రాజమౌళి మైండ్ లో బాహుబలి 3 ఆలోచన అలాగే ఉందని ప్రభాస్ మాటలని బట్టి అర్థం అవుతోంది. బాహుబలి పక్కన పెడితే.. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ మరోసారి సెట్ అయితే ఆ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడమే కష్టం. ప్రస్తుతం రాజమౌళి వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాధే శ్యామ్ చిత్రానికి తెలుగులో రాజమౌళి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.