
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రముఖ దిగ్గజ పాటల రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రిని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి ఉన్న రోజులను తలచుకుంటూ పలు ఇన్స్పైరింగ్ వర్డ్స్ ని వెల్లడించారు. సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా విడుదలైన `సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం` పుస్తకం మొదటి సంపుటి చూశాక పవన్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇందులో ఆయన అనేక విషయాలను గుర్తు చేశారు.
పవన్ మాట్లాడుతూ, `కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. భౌతికంగా లేకపోయినా తను సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచ భూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారు. ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి. సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక – ఆ అక్షర తపస్విని మొదటిసారి ‘రుద్రవీణ’ సినిమా సమయంలో కలసిన సందర్భం గుర్తుకు వచ్చింది.
అన్నయ్య చిరంజీవి నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను. ఆ సందర్భంలో శాస్త్రి గారిని తరచూ కలిసేవాడిని. ఆ చిత్రంలో ‘చుట్టూపక్కల చూడరా చిన్నవాడా’ పాటలో చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది/ గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది/ ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా/ తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే – అనే ఈ పంక్తులు ఇప్పటికీ నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. నన్ను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం నా విధిగా భావిస్తాను.
జనసేన పార్టీ పక్షాన కౌలు రైతులకు భరోసా ఇచ్చి ఆర్థిక సాయం చేయడం కూడా నా బాధ్యతే. మనకున్నది పదిమందికీ పంచాలి – అది ప్రకృతి ధర్మం అనే విషయాన్నీ రుద్రవీణలోని ‘తరలిరాద తనే వసంతం..’ అనే పాటలో వినిపించారు. ‘పంచే గుణమే పోతే – ప్రపంచమే శూన్యం/ఇది తెలియని మనుగడ కథ – దిశనెరుగని గమనము కద’ అనే పంక్తులలోని భావాన్ని అందరం తెలుసుకోవాలి. ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఒకసారి శ్రీ శాస్త్రి గారి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. సీతారామ శాస్త్రి గారు రచనలన్నిటిలో కవిగా ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సమాజానికీ బాధ్యతలు గుర్తు చేసే దృక్పథం అందులో నిక్షిప్తమై ఉంటుంది.
ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు.శాస్త్రి గారి రచనలలోని గాఢతను చెబుతూ కవిగా ఆయన్ని మరింత అర్థం చేసుకొనేలా చేశారు త్రివిక్రమ్ గారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ అందిస్తున్న ‘తానా’ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు` అని తెలిపారు పవన్ కళ్యాణ్. ట్విట్టర్ ద్వారా పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక పవన్ ప్రస్తుతం `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది.