యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అనగానే యమా క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చి క్లాప్ కొట్టడంతో క్రేజ్ డబులయింది. అయితే తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందనే వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అటు ఎన్టీఆర్ వర్గం నుంచి గానీ, త్రివిక్రమ్ సర్కిల్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, ఎవరూ స్పందించకపోవడంతో ఇది నిజమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా తన సొంత సినిమా ప్రారంభోత్సవాలకు కూడా ఆమడదూరంలో ఉంటారు. అలాంటిది ఏకంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారంటే అదో సంచలనమైంది. ఆ తర్వాత ఓపెనింగ్ షాట్కు పవన్ క్లాప్ కొట్టడం, ఎన్టీఆర్ ఫ్యామిలీతో పవన్ అన్యోన్యంగా మాట్లాడుతూ కనిపించిన ఫొటోలు ఇరు వర్గాల ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాయి.
అయితే సినిమా ప్రారంభోత్సవం తర్వాత.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య ఏవో క్రియేటివ్ విభేదాలు వచ్చాయని, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆ సినిమా చేయడం లేదని రూమర్స్ వచ్చాయి. దీనికి సపోర్టివ్ గా గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు సినీవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ భద్రాది పర్యటన తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకొంది.
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ల సినిమా జనవరి రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అప్పటివరకు మరో సినిమా త్రివిక్రమ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఓ వర్గం చెప్తున్నప్పటికీ.. అది కుదిరేలా లేదని వినిపిస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రంపై కాకుండా దిల్ రాజు రూపొందించబోయే చిత్రంపై దృష్టి పెట్టినట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. శతమానం భవతి దర్శకుడు సతీష్ వెగ్నేష చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సతీష్ వెగ్నేష చెప్పిన కథ విన్న దిల్ రాజు మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ చేస్తే ఈ చిత్రం బ్లాక్బస్టర్ కావడం తథ్యం అనే భావనలో దిల్ రాజు ఉన్నారట. దీంతో ఆ కథతోనే ఎన్టీఆర్తో సినిమాకు రంగం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్టీఆర్, దిల్ రాజు, సతీష్ కాంబినేషన్లో వచ్చే సినిమా టైటిల్ కూడా ఖరారు అయినట్టు సమాచారం. ఈ చిత్రానికి శ్రీనివాస కల్యాణం అనే పేరును ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడితే అప్పుడే లెక్క అని అంటున్నారు.
తాజాగా ఎన్టీఆర్ కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. కొరటాలతో మహేష్ సినిమా తర్వాత వచ్చే ఏడాది జనవరిలోగానీ, ఫిబ్రవరిలో గానీ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.