ఇటీవల టాలీవుడ్లో స్టార్ హీరోల నుంచి నిర్మాతలు, ప్రతి ఒక్కరు రివ్యూయర్లను బాగా టార్గెట్గా చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ డీజే టీం రివ్యూ రాసేవాళ్లపై మండిపడటం చూశాం. తాజాగా జైలవకుశ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ కూడా అదేబాటలో నడిచారు. రివ్యూయర్లను దారిన పోయే దానయ్యలు అన్నారు. మహేష్బాబు కూడా రివ్యూయర్లపై తమ అభిప్రాయాన్ని చెప్పారు. అర్హత లేని వాళ్లు కూడా రివ్యూలు రాసేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. వీళ్లు సీరియస్గా రివ్యూయర్లను టార్గెట్ చేస్తుండడంతో ఇది వాళ్ల ఉనికినే ప్రశ్నించే సమస్యగా మారింది.
రివ్యూయర్లు మంచిగా రాస్తే అంతా వాళ్లను పొగిడేస్తున్నారు... సినిమా తేడా కొట్టి నెగిటివ్గా రాస్తే రివ్యూయర్లను బాగా టార్గెట్ చేసేస్తున్నారు. ఇక వారం రోజుల క్రితం రిలీజ్ అయిన జై లవకుశ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూయర్లు కూడా అదే రాశారు. ఎన్టీఆర్ నటనను ఆకాశానికి ఎత్తేసిన రివ్యూయర్లు సినిమా కథ, కథనాల విషయంలో మాత్రం మరింత శ్రద్ధ పెట్టి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఎన్టీఆర్ రివ్యూయర్లపై కాస్త కోపాన్ని ప్రదర్శించి తన లెక్కేదో తాను చెప్పాడు.
ఇక బుధవారం రిలీజ్ అయిన స్పైడర్ సినిమాపై ముందే ట్వీట్ రివ్యూలు వచ్చేశాయి. ఓవర్సీస్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు చూసిన వారు ట్వీట్ రివ్యూలు ఇస్తే, కొందరు రివ్యూవర్లు చాలా ఎర్లీగానే రివ్యూలు ఇచ్చేశారు. వీరిలో కొందరు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్లో స్పందిస్తూ ఫైర్ అయ్యారు.
థియేటర్లలో ఇంకా షోలు కూడా పడకుండానే ఉదయం 3 గంటలకే ట్వీట్ రివ్యూలు ఇచ్చేశారు. ఇంత ముందుగా ఇలా అర్థ రాత్రి ట్వీట్ రివ్యూలు రాయడం బాధాకరమని తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే శోభు ట్వీట్పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెగిటివ్ రివ్యూలు ఇచ్చినందుకే ఆయన ఇలా ఫైర్ అవుతున్నారా ? అదే పాజిటివ్ రివ్యూలు ఇస్తే వాళ్లను మెచ్చుకునే వారా ? అనే కామెంట్లు కొందరు నెటిజన్లు చేస్తున్నారు.
మరోవైపు సినిమా బాగుంటే రివ్యూలు పాజిటివ్ గా వుంటాయి, లేకుంటే లేదు అని తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిన మహేష్ బాబు ఈ నెగటివ్ రివ్యూలను ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి.