
మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులను కలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధ్యతలు చేపట్టిన నేతలను ఒక్కొక్కరిగా కలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని మర్యాదపూర్వకరంగా కలిశారు. బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం సొంతింటిలో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు.
ఇక తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ని గురువారం రాత్రి ప్రజాభవన్ లో కలిశారు. టాలీవుడ్ కు పెద్దదిక్కులా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖతో కలిసి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో సత్కరించారు.
అనంతరం చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి, శాలువాతో భట్టి విక్రమార్క కూడా సత్కారం చేశారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. శుభాకాంక్షలు తెలిపిన తర్వాత భేటి అయ్యారు. అటు రాజకీయ, ఇటు సినిమా విషయాలపై చర్చించారు.
ఇక చిరంజీవి గతేడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో Mega156లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫాంటసీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మూవీ సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.