కులాంతర వివాహం చేసుకున్నారనే కక్షతో ప్రణయ్ అనే యువకుడిని హత్య చేయించిన సంగతి వెలుగులోకి వచ్చింది. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి తండ్రి మారుతీరావు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు.
కులాంతర వివాహం చేసుకున్నారనే కక్షతో ప్రణయ్ అనే యువకుడిని హత్య చేయించిన సంగతి వెలుగులోకి వచ్చింది. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి తండ్రి మారుతీరావు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కక్కరిగా స్పందిస్తున్నారు. హీరో మంచు మనోజ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఓ లేఖను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
''మానవత్వం కంటే కులం, మతం గొప్పవని భావించే వారికోసమే ఈ లేఖ. ఏ ఫీల్డ్ లో అయినా.. కాస్ట్ ఫీలింగ్ దానిపై ఆధారపడిన సినీ నటులు, రాజకీయ పార్టీలు, కాలేజ్ యూనియన్లు, కుల, మత సంస్థలన్నీ అనాగరికమైనవి. కులాన్ని సమర్ధించే వారంతా ప్రణయ్ అతని లాంటి చాలా మందిపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహించాలి. జీవిత విలువని ముందుగా మీరు తెలుసుకోవాలి.
ఇంకా ఈ లోకాన్నే చూడని పసికందు తన తండ్రి స్పర్శను తెలుసుకోకముందే.. అతని చేతిని పట్టుకోకముందే తండ్రిని కోల్పోయింది. మనందరికీ హృదయం, శరీరం ఒకేలా ఉన్నాయి. మనమంతా ఒకే గాలిని పీలుస్తున్నాం.. ఒకే సమాజంలో జీవిస్తున్నాం. అలాంటప్పుడు కులం పేరుతి ఈ వివక్ష ఎందుకు.. మనమంతా ఒకేటేనని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది.. కులాన్ని ప్రేమించేవారు, సపోర్ట్ చేసే వారిని చూసి సిగ్గుపడాలి.
కులపిచ్చిని రూపుమాపుదాం. ఇది నివారించాల్సిన పెద్ద రోగం. కాస్త కళ్లు తెరచి మనుషుల్లా ప్రవర్తించండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా అర్ధిస్తున్నాను. మన పిల్లలకి మంచి సమాజాన్ని అందిద్దాం. ప్రణయ్ భార్య అమృత, అలాగే అతని కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తున్నాను'' అంటూ పేర్కొన్నారు.
To everyone who murdered Pranay🙏 pic.twitter.com/idHfVK38eS
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1)