మంచు మనోజ్ ఆ మధ్య భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెతో ప్రేమలో పడటంపై మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భూమా మౌనికా రెడ్డితో ప్రేమలో పడిన తర్వాతే అభిమానుల ప్రేమంటే ఏంటో తెలిసింది. దాని విలువ తెలిసిందని అంటున్నారు మంచు మనోజ్. ఆయన రీఎంట్రీ ఇస్తూ `ఉస్తాద్`(ర్యాంప్ ఆడిద్దాం) పేరుతో ఇండియాలోనే బిగ్గెస్ట్ గేమ్ సో హోస్ట్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని నిర్వహిస్తుంది. ఇది ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి వారం ఇది ప్రసారం కానుంది. ఇందులో సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన లాంచింగ్ ప్రోమో విడుదలైంది. ఈ మేరకు బుధవారం ఈవెంట్ ని నిర్వహించారు.
ఈ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడుతూ, ఏడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్నానని, మౌనికతో ఏడు అడుగులు వేశాక మళ్లీ వస్తున్నట్టు చెప్పారు మంచు మనోజ్. చాలా ఎనర్జీతో వస్తున్నట్టు ఆయన చెప్పారు. లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నానని ఈ సమయంలో ఇలాంటి గేమ్ షోతో రావడం ఆనందంగా ఉందన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అభిమానులు ప్రేమ ఎప్పుడూ అలానే ఉందని, మౌనికతో ప్రేమలో పడిన తర్వాత ఫ్యాన్స్ ప్రేమేంటో తెలిసిందన్నారు.
ఏడు ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్నానని, ఇప్పుడు తాను మళ్లీ పుట్టానని, మళ్లీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తానని, ఇకపై ర్యాంప్ ఆడిస్తానని తెలిపారు మంచు మనోజ్. తనని ఎప్పటిలాగే ఆదరిస్తారని నమ్ముతున్నట్టు చెప్పారు. ఇక `ఉస్తాద్` షో గురించి చెబుతూ, ఇది ప్రతి వారం ఒక ఎపిసోడ్ ఉంటుందని, ఇందులో సెలబ్రిటీలు పాల్గొంటారని, ఎప్పుడు ఎవరు వస్తారనేది మాత్రం సస్పెన్స్ అని, మీకు మొదటి ఎపిసోడ్ అయ్యాక తెలుస్తుందన్నారు.
బాలకృష్ణలాంటి పెద్ద హీరో టీవీ షోస్ చేస్తున్నారని ప్రశ్నించగా, ఆయనది మహా వృక్షం లాంటి షో అని, ఆయనతో తాముపోల్చుకోలేమని, తమది సెపరేట్ అని వెల్లడించారు. కానీ కచ్చితంగా ఇది ఆకట్టుకునే షో అవుతుందన్నారు. ఇది ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.