
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మంచి సక్సెస్ ను సాధించిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మురళీ కిశోర్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 'ఆహా' ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు.
''కాన్సెప్ట్ తో మొదలై.. లవ్వూ కామెడీ మిక్సయి.. క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోండి''.. అంటూ తన వినరో భాగ్యము విష్ణు కథ గురించి ముందే టీజర్లో హీరో కిరణ్ అబ్బవరం చెప్పేసాడు. అది గుర్తు పెట్టుకుని చూస్తే పెద్ద ఇబ్బంది అనిపించదు. లేకపోతే మాత్రం ఇదేదో కొత్త మల్టీజానర్ మూవీ అనిపిస్తుంది. కొత్త దర్శకుడు దగ్గర విషయం ఉంది. అయితే దాన్ని అంతా మొదటి సినిమాలోనే ప్రదర్శనకు పెట్టేయాలనే తపన కూడా కనపడింది. ఏదో ఒక జానర్ తీసుకుని సరదాగా చెప్తే బాగుండే కాన్సెప్టు ఇది.
కథ ఏంటంటే...
తిరుపతి కుర్రాడు విష్ణు(కిరణ్ అబ్బవరం) సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి కాస్త సాయిపడవోయ్ టైపు కుర్రాడు. మరో ప్రక్క దర్శన (కశ్మీరా) ఎప్పుడెప్పుడు పాపులర్ అవుదామా అనే ఆలోచనలో, ప్రయత్నాల్లో ఉన్న ఓ యూట్యూబర్. ఆమె ఓ కొత్త కాన్సెప్ట్ కనుక్కుంటుంది. అది నంబర్ నైబర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్టు ద్వారా తన ప్రక్క నెంబర్స్ అయిన విష్ణు, మార్కేండేయ శర్మ (మురళీ శర్మ)లని కలుస్తుంది. దాంతో వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే విష్ణు, శర్మ ఇద్దరూ దర్శనను ప్రేమలో పడతారు. అలాగే యూట్యూబ్ లో పాపులర్ కావాలంటే ఏదైనా సెన్సేషన్ కంటెంట్ కావాలని సలహా ఇస్తాడు శర్మ. దాంతో దర్శన, శర్మ కలసి సాంగ్ కవర్ లు చేస్తారు. ఈ క్రమంలో దర్శన ఛానల్ పాపులర్ అవుతుంది. ఈ లోగా దర్శనకి మరో క్రేజీ ఐడియా వస్తుంది. శర్మతో కలిసి లైవ్ మర్డర్ అనే ప్రాంక్ వీడియోని ప్లాన్ చేస్తుంది దర్శన. అయితే ప్రాంక్ కాస్త నిజమైపోతుంది. శర్మ నిజంగానే దర్శన పేల్చిన తూటాకు బలవుతాడు. దీంతో ఆ హత్య కేసులో దర్శన జైలు పాలవుతుంది. మరి ఈ కేసు నుంచి తన ప్రేయసిని బయట పడేయటం కోసం విష్ణు ఏం చేశాడు? ఈ కేసులో విష్ణుకి తెలిసే సంచలనమైన నిజం తెలుసుతుంది. ఏమిటా నిజం ? ప్రాంక్ వికటించడానికి కారణం ఏమిటి ? అసలు శర్మ చంపాల్సిన అవసరం ఎవరికి వుంది ? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి ? అనేది మిగతా కథ.
కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. మురళీశర్మ కామెడీ .. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. అటు యూత్ .. ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అందువలన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.