
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ తదుపరి సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా నిర్మాతలు వెనుకాడ్డం లేదు. ‘బాహుబలి-2’ తర్వాత ప్రభాస్- దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించనుంది. ఈ సంస్థ ప్రభాస్ సొంత మనుషులదే. 150 కోట్ల రూపాయల బడ్జట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం.. దుబాయ్లో చేయబోయే ఒక్క ఛేజింగ్ ఫైట్కే దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలని టీం అంతా డిసైడ్ అయిపోయారట.
హాలీవుడ్లో ‘జేమ్స్బాండ్’ తరహా చిత్రాలకు పనిచేసిన ఓ హాలీవుడ్ టెక్నీషియన్ను ఈ ఛేజింగ్ ఫైట్ కోసం రప్పిస్తున్నారట. మొదట్లో ఈ టెక్నీషియన్నే ‘రోబో-2’ కోసం రప్పించాలనుకున్నారు శంకర్, రజనీకాంత్. అయితే అతని రెమ్యునరేషన్కు భయపడి వెనక్కుతగ్గారట. ఎందుకంటే ఆ హాలీవుడ్ టెక్నీషియన్ మాట్లాడడానికి కూడా డబ్బులు తీసుకుంటాడట. ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా సరే అలాంటి వాడిని తమ సినిమా కోసం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట ప్రభాస్. దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది కాబట్టి.. ఎంత ఖర్చుపెట్టినా వెనక్కి తిరిగి వచ్చేస్తుందన్న నమ్మకమే ప్రభాస్ నిర్ణయానికి కారణం. ఇదీ ‘బాహుబలి’ ఇచ్చిన కాన్ఫిడెన్స్!