
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్.. ఎన్టీఆర్ హోస్టు చేసి ‘బిగ్ బాస్’ షోతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతక ముందు కూడా ఆయన సినిమాలకు రివ్యూ ఇచ్చేవాడు. బిగ్ బాస్ తర్వాత ఆయన రివ్యూలపై మరింత ఆసక్తి ఏర్పడింది. సినిమాలపై అభిప్రాయాలను తెలియజేసే క్రమంలో కొన్ని సార్లు ఆయా హీరోల అభిమానుల ఆగ్రహానికి గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి.
బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాకి కత్తి.. రివ్వ్యూ ఎలా రాస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో హాజరవ్వడానికి ముంబయికి వెళ్తున్నానని.. రివ్వ్యూ రాయడం లేదని చెప్పాడు. దీంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇక తాజాగా.. బుధవారం విడుదలైన మహేష్ స్పైడర్ సినిమాకి కత్తి.. రివ్యూ ఇచ్చాడు.
స్పైడర్ సినిమా బాగా నిరాశపరిచిందని తేల్చిచెప్పాడు. ‘స్పైడర్ అనేది ఫోన్ డేటా ఆధారంగా ప్రజలను రక్షించే ఒక సూపర్ హీరో సినిమా. విలన్ ప్రజల ఏడుపులు విని ఆనందించే ఒక సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విలన్ను పట్టుకుని, జరుగుతున్న నేరాలను హీరో ఎలా అరికట్టాడనేదే’ సినిమా కథ అని కత్తి మహేష్ తెలిపాడు. సినిమా కథ వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ.. దానిని తెర మీద చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడని.. ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడని కత్తి మహేష్ తన రివ్వ్యూలో చెప్పాడు. సినిమాలో గ్రాఫిక్స్ కూడా సరిగా లేవని, పాత్రల పరిధిని ఇరికించినట్లు గా ఉందని అన్నాడు.
మహేష్ బాబు నటన మాత్రం ప్రజలను ఆకట్టుకుంటుందని.. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పారు. సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేదని, రకుల్ కి పెద్దగా నటించే స్కోప్ లేదని, మొత్తానికి సినిమా నిరుత్సాహ పరిచిందని చెప్పాడు.