
దొడ్డదారిలో డబ్బు సంపాందించేందుకు అక్రమార్కులు కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. తాజాగా కేరళలో వరద బీభత్సాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ యువకుడు పన్నిన పన్నాగాన్ని సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
కమెడియన్గా, హీరోగా రాణిస్తున్న సినీనటుడు శ్రీనివాస్ రెడ్డి పేరుతో ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసిన యువకుడు.. నటుడిలాగే ఛాటింగ్ చేశాడు. సినిమాలు, నటులు అంటే పిచ్చి ఉన్న వారిని టార్గెట్ చేసి వారితో సినిమా కథలకు సంబంధించిన చర్చల్ని కొనసాగించాడు. ఈ క్రమంలో కేరళ వరద బాధితుల కోసం విరాళాలు ఇవ్వాలంటూ తన ఖాతాలో పోస్ట్ పెట్టాడు.
అభిమాన నటుడి పిలుపు మేరకు కొందరు యువకులు పోస్ట్లో చెప్పిన ఖాతాలోకి డబ్బును జమ చేశారు. ఈ విషయం నటుడు శ్రీనివాస్ రెడ్డికి తెలియడంతో ఆయన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని.. సినీ పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ రవికిరణ్గా గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి మీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని రవికిరణ్ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. శ్రీనివాస్ రెడ్డికి క్షమాపణలు చెప్పి నకిలీ ఖాతాను తొలగించాడు.