
ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ కి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదం సమసిపోయింది. ఎన్ శంకర్ నల్గొండ జిల్లా వేములపల్లికి చెందిన వారు. ఎన్ శంకర్ ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా సేవలందించారు.
అయితే నాలుగేళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. శంకర్ తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలని గుర్తిస్తూ ఆయనకి శంకర్ పల్లిలోని మోకిల్ల అనే గ్రామంలో ఐదెకరాల భూమిని కేటాయించారు. కోట్ల విలువ చేసే భూమిని శంకర్ కి ప్రభుత్వం కేవలం ఎకరా రూ. 5 లక్షలకే కేటాయించింది అంటూ జయశంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు వివాదంగా కొనసాగుతూనే ఉంది.
ఎట్టకేలకు ఈ కేసు ముగింపుకు చేరుకుంది. తాజాగా నేడు హై కోర్టు శంకర్ కి అనుకూలంగా తీర్పు ప్రకటించింది. ప్రభుత్వ అడ్వాకెట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వినిపించిన వాదనలతో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ ఏకీభవించింది. 40 ఏళ్ల శంకర్ సినీ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆయనకి భూమిని కేటాయించింది అని ప్రసాద్ కోర్టుకి తెలిపారు. శంకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతో సపోర్ట్ చేశారని గుర్తు చేశారు.
కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం క్రీడారులకు, కళాకారులకు రాయితీలతో భూమిని కేటాయిస్తుందనే విషయాన్ని కూడా ఉటంకించారు. దీనితో ప్రసాద్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ప్రభుత్వం శంకర్ కి భూమిని కేటాయించడంలో తప్పులేదని.. ఇక ఇందులో జోక్యం అవసరం లేదని అభిప్రాయ పడింది. ఇందులో ఎక్కడా పక్షపాత ధోరణి, స్వాభిమానం లేదని కోర్టు పేర్కొంది. దీనితో ఏళ్లతరబడి కొనసాగుతున్నా వివాదం ఎన్ శంకర్ కి అనుకూలంగా ముగిసింది.
శంకర్ జై బోలో తెలంగాణ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో శ్రీరాములయ్య, జయం మనదే రా, ఆయుధం, భద్రాచలం లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి.