
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `తొలి ప్రేమ` చిత్రం 25ఏళ్ల క్రితం ఒక సంచలన చిత్రంగా నిలిచింది. లవ్ స్టోరీస్లో ట్రెండ్ సెట్టర్గా నిలవడం విశేషం. అద్బుతమైన మ్యాజిక్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్గా మార్చింది. ఇది అప్పటి స్టూడెంట్స్ పై బలమైన ప్రభావాన్ని చూపించింది. పవన్ మ్యానరిజమే కాదు, కాలేజ్ లవ్ స్టోరీస్ పరంగానూ ఈ సినిమానే స్టూడెంట్స్ ఫాలో అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. సినిమా కోసం కాలేజ్లు బంక్ కొట్టిన స్టూడెంట్స్ లెక్కే లేదు.
పవన్కి అంతకు ముందే `సుస్వాగతం` సక్సెస్ని ఇచ్చింది. కానీ `తొలిప్రేమ` మాత్రం ఆయన్ని స్టార్ హీరోని చేసింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అంతకు ముందు చిరంజీవి తమ్ముడిగానే చూసిన జనం ఈ సినిమాతో ఆయన్ని సపరేట్గా చూడటం స్టార్ట్ చేశారు. దర్శకుడు కరుణాకర్ కథ, డైరెక్షన్, దేవా సంగీతం ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. వీటికితోడు పవన్, కీర్తిరెడ్డి మధ్య లవ్ ట్రాక్ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది.
1998లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు లవ్ స్టోరీస్లో ఓ క్లాసిక్ మూవీలా నిలిచిపోయింది. ఎప్పుడూ చూసినా ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చే చిత్రంగా నిలుస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదలై 25ఏళ్లు అవుతుంది. జులై 24కి కరెక్ట్ గా 25ఏళ్లు. దీంతో తాజాగా ఈ సినిమా మళ్లీ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ఊపందుకున్న నేపథ్యంలో అందులో భాగంగా ఈ శుక్రవారం(జూన్ 30న) `తొలిప్రేమ`ని రీ రిలీజ్ చేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం మళ్లీ రిలీజ్ కానుండటం విశేషం.
తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. 4కే రిజల్యూషన్తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సైతం ఆకట్టుకుంటుంది. ఆ నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా శనివారం రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో చిత్ర దర్శకుడు కారుణాకరన్, చిత్ర నిర్మాత జీవీజీ రాజు(ఎస్ఎస్సి ఆర్ట్స్), పవన్కి చెల్లిగా నటించిన వసుకి, ఈ సినిమాతో ఆర్ట్ డైరెక్టర్గా పరిచయం అయిన ఆనంద్ సాయి, ప్రముఖ నిర్మాత దిల్రాజుతోపాటు సినిమాని రిలీజ్ చేస్తున్న రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి పాల్గొన్నారు.
`తొలిప్రేమ` రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్లని పవన్ కళ్యాణ్ తలపెట్టిన రైతు భరోసా యాత్రకి విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. శ్రీ మాతా క్రియేషన్స్ నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ.. `ఈ సినిమాని రీరిలీజ్ చేయడానికి కారణం.. అభిమానిగా ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. ఈ సినిమాని రీరిలీజ్ చేసే అవకాశాన్ని కల్పించిన జి.వి.జి.రాజు గారికి ధన్యవాదాలు. జూన్ 30 న ఈ సినిమాని భారీగా రీరిలీజ్ చేస్తున్నాం. అందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొత్త మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తలపెట్టిన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం` అని తెలిపారు. 300వందలకుపైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.
గెస్ట్ గా వచ్చి `తొలి ప్రేమ` ట్రైలర్ని రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ, `తొలిప్రేమ` అనేది ఒక గొప్ప జ్ఞాపకమని, ఇందులో భాగమైన పవన్ కళ్యాణ్, కరుణాకరన్, జి.వి.జి.రాజు అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం ఈ చిత్రం. నా సినీ ప్రయాణంలో `తొలిప్రేమ`కి అంటూ ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా అప్పుడప్పుడే నా ప్రయాణం మొదలైంది. అప్పటికీ ఒక్క `పెళ్లిపందిరి` మాత్రమే చేశా. జి.వి.జి.రాజు గారిని కలిసి డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగాను. ఒక్క సిట్టింగ్ లోనే సినిమా కొనడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాతో నాకు ప్రయాణం మొదలైంది. నేను నిర్మాతగా ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినా, నా మనసులో ఎప్పటికీ `తొలిప్రేమ`కి ప్రత్యేక స్థానముంటుంది.
సినిమా ప్రివ్యూ నుంచి వంద రోజుల ఫంక్షన్ వరకు ఎన్నో జ్ఞాపకాలు. వంద రోజుల ఫంక్షన్ రోజు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. అయినా ఫంక్షన్ కి కంట్రోల్ చేయలేనంతగా క్రౌడ్ వచ్చారు. ఒక చరిత్ర ఇది. అలాంటిది నేను మళ్ళీ చూడలేదు. ఇలా ఎన్నో చరిత్రలు సృష్టించిన సినిమా `తొలిప్రేమ`. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఎప్పుడు తక్కువున్నా ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాణ్ణి. ఏదైనా ఫ్లాప్ వస్తే, ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం కోసం ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాణ్ణి. అలా మళ్ళీ మూడుసార్లు రిలీజ్ చేశాం. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నాకు అడుగులు నేర్పించిన సినిమా `తొలిప్రేమ`. అలాంటి తొలిప్రేమలో నేను భాగమైనందుకు ఎప్పటికీ గర్వపడతాను. ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది` అని తెలిపారు.