నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రధారులుగా ఆద్యంతం హిలేరియస్ కామెడీగా రూపొందిన `జాతిరత్నాలు` సినిమాని బ్యాన్ చేయాలంటూ కేసు నమోదైంది.
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రధారులుగా ఆద్యంతం హిలేరియస్ కామెడీగా రూపొందిన చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించారు. రెండు వారాల క్రితం విడుదలైన ఈ సినిమా హిలేరియస్ కామెడీగా దూసుకుపోతుంది. ఊహించని విధంగా కలెక్షన్లని రాబడుతుంది. ఇప్పటికే ఇది 35కోట్లకుపైగా వసూళ్లని రాబట్టినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని బ్యాన్ చేయాలని కేసునమోదైంది. ఇందులోని ఓ డైలాగ్ వెటకారంగా ఉందని శివసేన డిమాండ్ చేస్తుంది. దీంతో సినిమాని నిషేధించాలని వారు కోరుతున్నారు. ఈ సినిమాలో స్వాతంత్ర సమరయోధులను కించపరిచారని, సినిమా దర్శకుడు, నిర్మాత, నటులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, సినిమాని బ్యాన్ చేయాలని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా గంగాధర్ బుధవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్ బిస్మిల్ ఉరికంబం ఎక్కే ముందు పాడిన `సర్ ఫరోషికీ తమన్నా హబ్ హమారే దిల్ మీ హై..` కవితను `జాతిరత్నాలు` సినిమాలో `సర్ ఫరోషికీ తమన్నా, సమంతా, రష్మిక, తీనోసాథ్ హాయ్..` అంటూ వెటకారంగా పాడి అవమానించారని తెలిపారు. నేటి తరానికి తప్పుడు సందేశాన్ని అందించిన సినీ రచయిత, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, కవితను ఆలపించి అవమానపరిచిన గాయకులపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.