
`అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలనేది మా తల్లి బసవతారకమ్మ కోరిక. ఆమె కోరిక మేరకు అత్యున్నత వైద్యం అందిస్తున్నాం` అని అన్నారు హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.. దీనికి సంబంధించిన భూమి పూజని తుళ్లూరు సమీపంలో నిర్వహించారు. ఇక్కడ బసవతారక ఆసుపత్రికి సంబంధించిన అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, మంచి కార్యక్రమానికి తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు.. ఈ బసవతారకం ఆసుపత్రికి 2019లోనే శంకుస్థాపన చేశాం. ఆ తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయాం. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనులు చేపట్టాం. ఇవాళ పండగ వాతావరణంలో ఆసుపత్రి పనులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది` అని చెప్పారు బాలయ్య.
ఆయన ఇంకా మాట్లాడుతూ, ఈ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లాభాపేక్ష కోసం కాదు, దాతల సహకారంతో నడుస్తోంది. రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా దేశంలోనే మంచి పేరుని తెచ్చుకుంది. అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలని మా తల్లి బసవతారకం కోరిక. ఆమె కోరిక మేరకు బెస్ట్ సర్వీస్ అందిస్తున్నాం. అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రికి మొదటి విడతలో రూ.750 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొదటి విడత పనులు 2028 కల్లా పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం` అని తెలిపారు బాలయ్య.
ఇక ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వివరాలు చూస్తే, ఏపీ రాజధాని అమరావతిలో 21 ఎకరాల్లో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఈ క్యాన్సర్ కేర్ క్యాంపస్లో సమగ్ర క్యాన్సర్ చికిత్స పరిశోధనతోపాటు రోగుల సంరక్షణకు ఎక్స్ లెన్సీ సెంటర్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తొలి దశలో 500 పడకల విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందించనున్నారు. ఇందులో మౌళిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూరుస్తారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్తో ఏర్పాటు చేసి 2028 నాటికి ఆపరేషన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రెండో దశలో పడకల స్థాయి వెయ్యికి పెంచబోతున్నారు.
ప్రస్తుతం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ సెంటర్ని హైదరాబాద్లో రన్ చేస్తున్నారు. దీనికి బాలకృష్ణ చైర్మెన్గా ఉన్నారు. బాలయ్య తల్లి క్యాన్సర్తో మరణించారు. ఆ సమయంలో మన వద్ద క్యాన్సర్ కి చికిత్స లేదు. దీంతో ఆ బాధతోనే ఎన్టీఆర్ ఈ క్యాన్సర్ ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. 2000లో అప్పటి ప్రధాని వాజ్పాయ్ చేతుల మీదుగా ఈ ఆసుపత్రి ప్రారంభమైంది.