
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత సొంతం చేసుకుంది జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే 500 కోట్లు దాటగా... రిలీజైన తర్వాత కలెక్షన్లు కూడా కనీ వినీ ఎరగని రేంజ్ లో ఉండాలని ఆర్కా మీడియా ప్లాన్ చేస్తోంది. అందుకే బాహుబలి 2 ది కన్ క్లూజన్ చిత్రానికి తెగ పబ్లిసిటీ ఇస్తోంది రాజమౌళి అండ్ కో. మరో వారం మాత్రమే మిగిలుండటంతో జోరందుకున్న 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా హైప్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. బాహుబలి రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంత ఉత్కంఠగా ఉన్నారో చెప్పనవసరంలేదు.
'బాహుబలి-2' టికెట్ల కోసం డిమాండ్ కూడా ఊహించని స్థాయిలో ఉండబోతోంది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమానూ చూడనంతమంది ఈ చిత్రాన్ని చూస్తారని అంచనా వేస్తున్నారు. బాహుబలి-2 టికెట్ కోసం నిర్ణీత ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అధికారికంగానే బాహుబలి-2 టికెట్ల రేట్లను పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారట బాహుబలి నిర్మాతలు.
ఎన్నో కష్టాలకు ఓర్చి.. భారీ ఖర్చుతో ఈ సినిమాను తెరకెక్కించామని.. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తేవడంతో పాటు తెలుగు జాతికే గర్వకారణంగా నిలిచిన సినిమా ఇదని.. ఇలాంటి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని.. దీనిపై ప్రేక్షకుల్లోనూ అంత వ్యతిరేకత ఉండదని ప్రభుత్వానికి విన్నవించుకుని టికెట్ల రేట్ల పెంపు నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారు 'బాహుబలి' నిర్మాతలు.
మరోవైపు తొలి వారంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా అనుమతి తెచ్చుకోవాలన్న ప్రయత్నం కూడా చేస్తున్నారట ప్రొడ్యూసర్లు. ఈ రెండు ప్రతిపాదనలు గనక ఓకే అయితే.. బాహుబలి టీం పంట పండినట్లే. కలెక్షన్ల మోత మోగిపోవడం.. దేశ చరిత్రలోనే బాక్సాఫీస్లో ఎవ్వరూ టచ్ చేయలేని ఫిగర్స్ నమోదవడం గ్యారెంటీ.