
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’. ఈ నెల 17న పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ విడుదలైన ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. భారీ ఓపెనింగ్స్ నమోదు చేసి అందరి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లోనే రూ. 116 కోట్లు గ్రాస్ వసూళ్ళు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..అన్ని చోట్ల నుంచి కూడా పుష్పకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అక్కడ ప్రీమియర్స్, తొలిరోజు కలెక్షన్లు కలుపుకుని ఏకంగా 8 లక్షల 50వేల డాలర్లు(రూ.6.46కోట్లు) కలెక్ట్ చేసింది. రెండో రోజు(శనివారం) సాయంత్రం 6.30 గంటల షో వరకు 330 లోకేషన్స్లో 3లక్షల 24వేల డాలర్లు(రూ.2.59కోట్లు) వచ్చాయి. దాంతో ఇప్పటివరకు యూఎస్లో పుష్ప మొత్తం కలెక్షన్లు 1.30 మిలియన్ డాలర్లకు(రూ.9.88కోట్లు) చేరాయి. కాగా, రన్టైమ్ మొత్తంలో 'పుష్ప' మరో రెండు చిత్రాల వసూళ్లను కూడా దాటేసే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు ఇలాగే స్టడీగా కొనసాగితే బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'అలా వైకుంఠపురంలో', రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్లోని బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' చిత్రాలను వెనక్కి నెట్టేస్తుందంటు న్నారు. 'అలా వైకుంఠపురంలో' మూవీ అమెరికాలో మొత్తం రన్టైమ్లో 3.63 మిలియన్ డాలర్లు(రూ.27.59కోట్లు) కొల్లగొట్టింది. ఇదే బన్నీ కెరీర్లో యూఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం. దీంతో భారతీయ చిత్రాలు అమెరికాలో సాధించిన అత్యధిక వసూళ్ల జాబితాలో ఈ సినిమా మూడో స్థానంలో ఉంది.
బన్నీ ఒన్ మేన్ షో, సుకుమార్ టేకింగ్, రష్మికా గ్లామర్, దేవీశ్రీ పాటు ఈ సినిమాను మాస్ జనానికి బాగా దగ్గర చేసింది. మొదటి మూడురోజుల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్ళను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. బన్నీ నటనే మాస్ జనాన్ని థియేటర్స్ కు రప్పిస్తోంది. మరో సినిమా వచ్చే వరకూ ‘పుష్ప’ ఓ రేంజ్ లో వసూళ్ళు కురిపిస్తాడని అంచనా వేస్తున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.