
కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటోంది. సెకండ్ వేవ్లో విలయతాండవం చేసిన కరోనా ఇప్పుడు నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో కేసులు రోజు రోజుకు సాప కింద నీరులా విస్తరిస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్(Arjun) కరోనా బారిన పడ్డారు. నిన్న(సోమవారం) బాలీవుడ్ భామ కరీనా కపూర్ కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న అర్జున్కి కోవిడ్ 19(Arjun Corona) నిర్థారణ అయ్యింది.
ఈ విషయాన్ని అర్జున్ తెలిపారు. తనకి కరోనా సోకిందని, తనకు తాను ఐసోలేట్ అయినట్టు, అలాగే కోవిడ్కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు అర్జున్. ఇటీవల కాలంలో తనని కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ కచ్చితంగా ధరించాలని తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఎలా సోకిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
అర్జున్ ఇటీవల జీ తమిళ టీవీలో ప్రసారమవుతున్న వరల్డ్ ఫేమస్ రియాలిటీ షో సర్వైవర్ తమిళకి అర్జున్ హోస్ట్ గా చేశారు. ఇది ఆఫ్రికన్ ఐలాండ్లో చిత్రీకరించారు. ఇందులో విక్రాంత్, నందా, నారాయణ్, ఇనిగో ప్రభాకర్, ఉమాపతి, శరణ్, లక్ష్మి ప్రియా, ఐశ్వర్య క్రిష్ణన్, గాయత్రి, ఇంద్రజ శంకర్,బెసంత్ రవి, వీజే పార్వతి వంటి వారు ఇందులో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. వారిలో ఇప్పుడు టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే యాక్షన్ సినిమాలతో, ముఖ్యంగా దేశభక్తి సినిమాలతో పాపులార్ అయ్యారు అర్జున్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తున్నారు.