
ఐపీఎల్ 2022 సీజన్లో పర్పుల్ క్యాప్ గెలిచి, అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు భారత సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యజ్వేంద్ర చాహాల్, ఐపీఎల్ 2022 సీజన్లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే...
8 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో సభ్యుడిగా ఉన్న యజ్వేంద్ర చాహాల్ను ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. వేలంలో చాహాల్ని కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు, అతన్ని పర్ఫెక్ట్గా వాడుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన యజ్వేంద్ర చాహాల్, ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ తన స్టైల్లో అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో వినోదాన్ని పంచాడు...
సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కి ఎంపికైన యజ్వేంద్ర చాహాల్, సోషల్ మీడియాలో ఓ ఫన్నీ ఫోటోను పోస్ట్ చేశాడు. సోరకాయతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన యజ్వేంద్ర చాహాల్... ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇలా ఫోజు ఇచ్చాడు...
దీనిపై ఫన్నీగా స్పందించాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ‘చూస్తుంటే నీ లోకీ (సోరకాయ) కూడా నీ సైజులోనే ఉన్నట్టుంది...’ అంటూ నవ్వుతున్నట్టుగా ఎమోజీ జోడించాడు యువీ...
యజ్వేంద్ర చాహాల్, యువరాజ్ సింగ్ మంచి స్నేహితులు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్ని పక్కనబెట్టి భారీ మూల్యమే చెల్లించుకుంది టీమిండియా. మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, ఆ తర్వాత న్యూజిలాండ్ మ్యాచ్లోనూ చిత్తుగా ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది... యజ్వేంద్ర చాహాల్ స్థానంలో టీమ్కి ఎంపికైన రాహుల్ చాహాల్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా... మిస్టరీ స్పిన్నర్గా టీమిండియాలోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి పేలవ ప్రదర్శనతో జట్టుకి దూరమయ్యాడు...
దీంతో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్లు ఉండడం తప్పనిసరిగా మారింది. అదీకాకుండా ప్రస్తుత సారథి రోహిత్ శర్మకు, యజ్వేంద్ర చాహాల్కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో చాహాల్, టీ20 వరల్డ్ కప్ ఆడాల్సిందేనని రోహిత్ శర్మ పట్టుబట్టి, సెలక్టర్లను ఒప్పించవచ్చని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
14 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2022 సీజన్లో ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్ జట్టు, టైటిల్ ఫైట్లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా, అండర్ డాగ్స్గా బరిలో దిగి ఆరంగ్రేటం సీజన్లో టైటిల్ ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఈ విజయంతో భారత ఆల్రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినట్టైంది.