
కరాచీ వేదికగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా ల మధ్య రెండో టెస్టు.. స్టేడియంలో ఓ అభిమాని లేచి ఓ ఫ్లకార్డు పట్టుకున్నాడు. ఫ్లకార్డులో భారత మాజీ సారథి విరాట్ కోహ్లి ఫోటో. ఈ మ్యాచుకు విరాట్ కు సంబంధమే లేదు. కానీ భారత్ తో పాటు పాక్ లో కూడా అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీంతో పాక్ లో ఏ మ్యాచ్ జరిగినా అక్కడి అభిమానులు మాత్రం కోహ్లిపై అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
తాజాగా పాక్-ఆసీస్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ కు చెందిన కోహ్లి అభిమాని ఒకరు ఫ్లకార్డుతో విరాట్ మీద ప్రేమను కురిపించాడు. ఫ్లకార్డులో.. ‘డీయర్ విరాట్.. నువ్వు సెంచరీ చేయి.. చేయకపో.. నాకు సంబంధం లేదు. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ నా హీరోవి.. ’ అని రాసుకొచ్చాడు.
ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ లో జరిగిన మ్యాచులు, ఆసియాకప్, ఐసీసీ టోర్నీలు మినహా ఇంతవరకూ కోహ్లి పాక్ లో ఒక్క మ్యాచు కూడా ఆడలేదు. అయినా కోహ్లికి అక్కడ పాలోయింగ్ చూస్తే అతడి క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పాక్ లో అభిమానులు కోహ్లి మీద ఇలా అభిమానం చూపెట్టడం ఇదే కొత్త కాదు. ఇటీవలే ముగిసిన రావల్పిండి టెస్టులో కూడా ఆ దేశానికి చెందిన ఇద్దరు అభిమానులు.. స్టేడియంలోకి కోహ్లి బ్యానర్లతో వచ్చి హంగామా చేశారు. బ్యానర్ల మీద.. ‘కోహ్లి.. నీ 71వ సెంచరీ పాకిస్థాన్ మీద చేయాలని మేము కోరుకుంటున్నాం..’ అని రాశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పాకిస్థాన్ లో కోహ్లి సెంచరీ సాధించాలనే అతడి అభిమానుల కోరిక నెరవేరకపోవచ్చు. ఎందుకంటే గత దశాబ్దకాలంగా పాక్ తో నెలకొన్న సరిహద్దు సమస్యలతో భారత్ ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. చివరిసారిగా భారత్ 2008లో పాక్ లో పర్యటించింది. అప్పటికీ కోహ్లి భారత జట్టులొ భాగం కాలేదు. ఇక కొద్దిరోజులగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లను జరగడం లేదు. కానీ ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ వంటి అంతర్జాతీయ టోర్నీలలో మాత్రమే రెండు జట్లు ఢీకొంటున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల రీత్యా ఇప్పట్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్ జరుగడం కూడా కచ్చితంగా కష్టమే..