
అండర్19 వరల్డ్ కప్ 2020 హీరో యశస్వి జైస్వాల్, టీమిండియా ఆరంగ్రేటం మ్యాచ్లోనే సెంచరీ అందుకున్నాడు. స్పిన్కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్పై ఆచితూచి ఆడుతూ, ఐపీఎల్లో భారీ షాట్లతో విరుచుకుపడే మాస్ ప్లేయర్ మాత్రమే కాదు, ఓపిగ్గా ఇన్నింగ్స్ నిర్మించే టెస్టు ప్లేయర్ కూడా తనలో ఉన్నాడని మొదటి మ్యాచ్లోనే నిరూపించుకున్నాడు యశస్వి జైస్వాల్..
తొలి రోజు రెండున్నర సెషన్లలోనే వెస్టిండీస్ని 150 పరుగులకి ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో రోజు ఆతిథ్య జట్టుకి వికెట్ ఇవ్వకుండా ఆధిక్యంలోకి వచ్చేసింది. ఓవర్నైట్ స్కోరు 80/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 69.1 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 205 పరుగులు చేసింది. ఇప్పటికే వెస్టిండీస్ కంటే 55 పరుగుల ఆధిక్యంలో నిలిచింది టీమిండియా..
104 బంతుల్లో 7 ఫోర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి జైస్వాల్, 215 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో 200 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్కి అజేయంగా 205 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ బాదిన 17వ భారత క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్. ఇంతకుముందు లాలా అమర్నాథ్ నుంచి శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ వరకూ 16 మంది బ్యాటర్లు ఆరంగ్రేటం టెస్టుల్లో సెంచరీలు బాదారు. వికెట్ నష్టపోకుండా వెస్టిండీస్ బాదిన తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేసింది భారత జట్టు..
టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో ఓపెనర్లు, ప్రత్యర్థి జట్టు స్కోరు కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం జోడించడం ఇదే తొలిసారి. వెస్టిండీస్లో టీమిండియాకి ఇదే అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం కూడా.
అల్జెరీ జోసఫ్ వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ బాదిన రోహిత్ శర్మ, 106 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ టెస్టు కెరీర్లో ఇది 15వ హాఫ్ సెంచరీ. రోహిత్ శర్మ టెస్టుల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్గా టెస్టుల్లో అత్యధిక యావరేజ్ కలిగిన భారత బ్యాటర్గా టాప్లో నిలిచాడు రోహిత్ శర్మ.