
‘వన్ నేషన్ వన్ రేషన్’, ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’, ‘ఒకే దేశం-ఒకే చట్టం’ ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్’ అని దేశంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్నిరోజులుగా నినాదాలిస్తున్నది. దేశంలోని ప్రతి వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా కుమారుడు జై షా మాత్రం ‘వన్ నేషన్ - టూ టీమ్స్’ అని నినాదం అందుకున్నాడు. ఏకకాలంలో భారత్ కు చెందిన రెండు జట్లు వేర్వేరు ప్రత్యర్థులతో తలపడే రోజులు రాబోతున్నాయని.. అలా సిరీస్ లను నిర్వహించే సత్తా తమకు ఉందని జై షా చెప్పాడు.
భారత జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. అదే క్రమంలో మరో జట్టు ఐర్లాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్ లు సమాంతరంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో షా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నేను ఎన్సీఎ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తో పలుమార్లు చర్చించా. రోస్టర్ విధానంలో కనీసం 50 మంది ఆటగాళ్లు ఉండాలి. రాబోయే కాలంలో బారత టెస్టు జట్టు ఒక దేశంలో టెస్టు సిరీస్ ఆడుతుంటే మరో జట్టు మరో దేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఏకకాలంలో రెండు జట్లు రెండు సిరీస్ లను ఆడే విధంగా మేం ముందుకుసాగుతున్నాం..’అని షా చెప్పుకొచ్చాడు.
అయితే షా చెప్పిన ఫార్ములా కొత్తదేం కాదు. గతేడాది విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతుంటే శిఖర్ ధావన్ నేతృత్వంలోని మరో జట్టు.. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లు ఆడింది. రాబోయే రోజుల్లో ఇదే ఫార్ములా ను అమలుచేయనున్నట్టు షా తెలిపాడు.
ఐపీఎల్ రెండున్నర నెలలు..
రాబోయే 2023-27 కాలానికి ఐపీఎల్ మ్యాచుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో అందుకోసం ఐసీసీ తో కలిసి పనిచేస్తామని, ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ద్వైపాక్షిక సిరీస్ లను లేకుండా చూస్తామని జై షా అన్నాడు. ‘వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ రెండున్నర నెలలు ఉండబోతుంది. ఈ లీగ్ లో అంతర్జాతీయ స్టార్స్ అందరూ పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం ఐసీసీ ఫ్యూచర్ టర్మ్ ప్లాన్ (ఎఫ్టీపీ) లో ఐపీఎల్ కోసం ప్రత్యేక క్యాలెండర్ ఉండే విధంగా మేం ప్రయత్నిస్తున్నాం. దానిమీద మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఐసీసీతో పాటు ఇతర బోర్డులను కూడా సంప్రదించి ఏ సమస్యా లేకుండా చూసుకుంటాం..’ అని వివరించాడు.