
ఐసీసీ డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో వరుసగా రెండో టెస్టులో విజయం అందుకుంది ఇంగ్లాండ్ జట్టు. గత 13 మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్, కెప్టెన్సీ మార్పు, హెడ్ కోచ్ను మారుస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో విజయాలు అందుకుంది..
లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు, ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన రెండో టెస్టులోనూ సేమ్ ఫీట్ రిపీట్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు, తొలి ఇన్నింగ్స్లో 145.3 ఓవర్లలో 553 పరుగుల భారీ స్కోరు చేసింది...
డార్ల్ మిచెల్ 190 పరుగులు, టామ్ బ్లండెల్ 106 పరుగులు చేయగా విల్ యంగ్ 47, డివాన్ కాన్వే 46 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 128.2 ఓవర్లలో 539 పరుగులు చేసింది. ఓల్లీ పోప్ 145, జో రూట్ 176 పరుగులు చేయగా అలెక్స్ లీస్ 67, బెన్ స్టోక్స్ 46, క్రిస్ ఫోక్స్ 56 పరుగులు చేసి ఆకట్టుకున్నారు..
తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్కి 14 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు 84.4 ఓవర్లలో 284 పరుగులకి ఆలౌట్ అయ్యింది. విల్ యంగ్ 56, డివాన్ కాన్వే 52, డార్ల్ మిచెల్ 62 పరుగులు చేయగా టామ్ బ్లండెల్ 2, బ్రాస్వెల్ 2 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ తొలి ఇన్నింగ్స్ 3, రెండో ఇన్నింగ్స్ 2 వికెట్లు తీయగా, స్టువర్ట్ బ్రాడ్ తొలి ఇన్నింగ్స్లో 2, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు...
ఆఖరి రోజు 72 ఓవర్లలో 299 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు, ఆ టార్గెట్ని 50 ఓవర్లలో ఊది పాడేసింది. జాక్ క్రావ్లే డకౌట్ అయినా బీభత్సమైన ఫామ్లో ఉన్న జో రూట్ 3 పరుగులకే అవుటై నిరాశపరచగా, ఓల్లీ పోప్ 18, అలెక్స్ లీస్ 44 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
అయితే జానీ బెయిర్ స్టో 92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 136 పరుగులు చేసి, టెస్టుల్లో టీ20 బ్యాటింగ్ చూపించాడు. బెయిర్ స్టో అవుటైనా కెప్టెన్ బెన్ స్టోక్స్ 70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు, బెన్ ఫోక్స్ 12 పరుగులు చేసి మ్యాచ్ని 50 ఓవర్లలోనే ముగించారు..
‘సరిగ్గా ఏడాది క్రితం జూన్ 2021లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో 75 ఓవర్లలో 273 పరుగుల టార్గెట్ని ఛేదించినలేక 70 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ని డ్రా చేసుకుంది ఇంగ్లాండ్. సరిగ్గా ఏడాది తర్వాత జూన్ 2022లో అదే న్యూజిలాండ్ 72 ఓవర్లలో 299 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తే, దాన్ని 50 ఓవర్లలోనే ఛేదించేసింది... ఏడాదిలో ఏం మారింది? మైండ్ సెట్...’ అంటూ ఇంగ్లాండ్ విజయంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది...
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ హెడ్ కోచ్గా, బెన్ స్టోక్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్లోనూ దూకుడు మంత్రాన్ని జపిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతోంది ఇంగ్లాండ్...