విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకోవడం టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం ఏమీ బాగాలేదన్న దానికి నిదర్శనం అని పేర్కొన్నాడు.
టీమిండియాలో గ్రూప్స్ ఉన్నాయా..? ఆ గ్రూపులు కారణంగానే.. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడా..? ఈ కారణంగానే.. ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు.. కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు అప్పగించారా..? ఇవే సందేహాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న కోహ్లీ సడెన్ గా.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అందరిలోనూ అనుమానాలుు వ్యక్తమౌతున్నాయి. దానికి తోడు.. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటకీ... జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని కోహ్లీ ఎప్పుడో ప్రకటించాడు. అయితే.. తాజాగా ప్రకటించిన జట్టులో అసలు కోహ్లీ పేరు లేనే లేదు. దీంతో.. అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ క్రమంలో.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకోవడం టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం ఏమీ బాగాలేదన్న దానికి నిదర్శనం అని పేర్కొన్నాడు.
"ఓ విజయవంతమైన కెప్టెన్ తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడంటే దానర్థం జట్టులో విభేదాలున్నాయనే. ఇప్పుడు టీమిండియాలో నాకు రెండు గ్రూపులు కనిపిస్తున్నాయి. ఒకటి ఢిల్లీ గ్రూప్, రెండోది ముంబయి గ్రూప్. టీమిండియా ఆటగాళ్లు ఈ రెండు గ్రూపులుగా విడిపోయారు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతాడనిపిస్తోంది. కానీ ఐపీఎల్ లో కొనసాగుతాడని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు. కాగా.. టీమిండియాలో కోహ్లీ ఢిల్లీకి చెందినవాడు కాగా.. రోహిత్ శర్మ ముంబయి వాలా. ఈ క్రమంలో.. వీరిద్దరి మధ్యే విభేదాలు ఉన్నాయని అర్థం వచ్చేలా ముస్తాక్ కామెంట్స్ చేయడం గమనార్హం. గతంలోనూ.. కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఇద్దరూ ఏ రోజు ఈ విషయంపై స్పందించలేదు.
ఇక టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఓటములకు ఐపీఎలే కారణమని ముస్తాక్ అహ్మద్ ఆరోపించాడు. వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీకి ముందు దీర్ఘకాలంగా బయోబబుల్ లో ఉండడం ఆటగాళ్లను అలసటకు గురిచేసిందని అభిప్రాయపడ్డాడు.
అటు, పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు కూడా మనుషులేనని, ఇన్నాళ్లపాటు బయోబబుల్ లో ఉండడం ఏమంత సులువు కాదని అన్నాడు. ఈ వరల్డ్ కప్ కు టీమిండియా ఆటగాళ్లు మానసికంగా సంసిద్ధంగా లేరన్న రవిశాస్త్రి అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తానని హక్ పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్-2లో ఉన్న టీమిండియా... పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను చేజార్చుకోవడం తెలిసిందే. దాంతో జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే భారత్ సెమీస్ వెళ్లే చాన్సు ఉన్నప్పటికీ, ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవడంతో భారత్ ఆశలకు తెరపడింది. గ్రూప్-2లో ఆ రెండు ఓటముల తర్వాత టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచినా ఫలితం లేకపోయింది.