
చిన్నప్పట్నుంచీ తనకు ఆటలో ఓనమాలు నేర్పిన క్రికెట్ క్లబ్ ఇప్పుడు ఏకాకి కావడంతో టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ చలించిపోయాడు. భారత జాతీయ జట్టుకు సుమారు 12 మంది అంతర్జాతీయ క్రికెటర్లను అందించిన క్రికెట్ క్లబ్ కు మద్దతుగా నిలిచాడు. ఎంతోమంది క్రికెటర్లకు ఆటలో మెలుకువలు నేర్పిన క్రికెట్ క్లబ్ ను రోడ్డుపాలు చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశాడు.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలోని వెంకటేశ్వర కాలేజీలో ఉంటున్న సోనెట్ క్రికెట్ క్లబ్ ను తక్షణమే ఖాళీ చేయాలని కాలేజీ యాజమన్యం నోటీసులు పంపింది. ఈ నిర్ణయంతో చాలాకాలంగా ఇక్కడే సేవలందిస్తున్న సోనెట్ క్లబ్ కు నిలువ నీడ లేకుండా మారింది.
దీనిపై ఓ జర్నలిస్టు ట్విటర్ లో ట్వీట్ చేశాడు. ఇది చూసి చలించిన పంత్.. ‘నాతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లను అందించిన నా క్లబ్ ను చూస్తే గుండె తరుక్కుపోతున్నది. చాలాకాలంగా యువ క్రికెటర్లకు సేవలందిస్తున్న ఈ క్రికెట్ క్లబ్ ను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సమంజసం కాదు. నావంటి ఎంతో క్రికెటర్ల కెరీర్ ను పదునుపెట్టడంలో సోనెట్ కీలక పాత్ర పోషిస్తున్నది. నాతో సహా చాలా మంది దానిని ఒక ఇల్లులాగా భావిస్తాం. వెంకటేశ్వర కాలేజీ నిర్దేశించిన నిబంధనలను మేం పాటిస్తున్నాం. దయుంచి వెంకటేశ్వర కాలేజీ గవర్నింగ్ బాడీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సోనెట్ ను ఒక క్లబ్ లా కాకుండా ప్రతిష్టాత్మక సంస్థగా భావించాలి. రాబోయే రోజుల్లో మరింత మంది క్రికెటర్లకు అది హోమ్ గా మరుతుంది..’ అని ట్వీట్ చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా దీనిపై స్పందించాడు. ట్విటర్ వేదికగా ఆకాశ్ స్పందిస్తూ.. ‘ఇది నన్ను తీవ్ర షాక్ కు గురిచేసింది. సోనెట్ క్రికెట్ క్లబ్ భారత క్రికెట్ కు చాలాకాలంగా సేవలందిస్తోంది. దాదాపు డజను మందికి పైగా అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు వందలాది మంది దేశవాళీ క్రికెటర్లు ఇక్కడ శిక్షణ పొందారు. వెంకటేశ్వర కాలేజీ ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నా..’అని ట్వీట్ చేశాడు.
కాగా సీకే నాయుడు ట్రోఫీకి గాను ఢిల్లీ జూనియర్ జట్టుకు ఎంపిక కాలేదని తారక్ సిన్హా అనే క్రికెటర్ 19 ఏండ్ల వయసులోనే 1969లో సోనెట్ క్లబ్ ను ప్రారంభించాడు. వెంకటేశ్వర కాలేజీ వేదికగా దీని కార్యకలాపాలు సాగిస్తున్నారు. వందలాది మంది యువ క్రికెటర్లకు ఆయన ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చాడు. భారత జట్టు మాజీ ఆటగాళ్లు మనోజ్ ప్రభాకర్, ఆశిష్ నెహ్రా, ఆకాశ్ చోప్రా లతో పాటు యువ క్రికెటర్లు రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), హృతీక్ షోకీన్ (ముంబై ఇండియన్స్) లు ఇక్కడ శిక్షణ పొందినవారే. టీమిండియా మహిళా జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రా కూడా ఇక్కడే శిక్షణ తీసుకుంది.