మీకు మాకు ఉన్న తేడా ఇదే! ముందు మీ దేశాన్ని బాగుచేయడంపై శ్రద్ధ పెట్టండి... పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ కౌంటర్

By Chinthakindhi RamuFirst Published Nov 12, 2022, 6:00 PM IST
Highlights

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని 152/0 వర్సెస్ 170/0 గా అభివర్ణించిన పాక్ ప్రధాని షాబజ్ షరీఫ్... ‘ముందు మీ దేశాన్ని బాగు చేయడంపై శ్రద్ధ పెట్టాలంటూ’ కౌంటర్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌పై ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకున్న భారత జట్టు, గ్రూప్ స్టేజీలో ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుంది. టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది. ఇండియాతో మ్యాచ్‌లో ఓడిన తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఓడింది పాకిస్తాన్...

130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 128 పరుగులకి పరిమితమై ఘోర పరాజయాన్ని చవి చూసింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్‌కి వరుస విజయాలు దక్కాయి. నెదర్లాండ్స్, సౌతాఫ్రికాలపై విజయాలు అందుకున్న పాక్, కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించింది...

సూపర్ 12 రౌండ్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో తప్ప మరో మ్యాచ్ గెలవని నెదర్లాండ్స్ జట్టు... ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. అప్పటి దాకా టీ20 వరల్డ్ కప్‌లో తమ ప్రయాణం ముగిసిందని, స్వదేశానికి వెళ్లడానికి బ్యాగులు కూడా సర్దిపెట్టుకున్న పాకిస్తాన్ జట్టు... ఒక్కసారిగా అదృష్టం ఈడ్చి పెట్టి దన్నడంతో వెళ్లి సెమీస్‌ బుట్టులో పడింది...

సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు చెత్తాటతో ఏకంగా ఫైనల్‌కి వెళ్లి కూర్చుంది పాకిస్తాన్. మరోవైపు టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత జట్టు, ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయలేక 10 వికెట్ల తేడాతో ఓడింది.. ఈ మ్యాచ్ తర్వాత పాక్ ప్రధాని షాబజ్ షరీఫ్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...

‘అయితే ఈ ఆదివారం... 152/0 వర్సెస్ 170/0 అన్నమాట...’ అంటూ ట్వీట్ చేశాడు షరీఫ్. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 151 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. దీంతో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచిన రెండు జట్ల మధ్య పోటీ అంటూ వ్యంగ్యంగా ఇలా ట్వీట్ చేశాడు షరీఫ్...

దీనికి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘ఇదిగో ఇదే మీకూ మాకూ ఉన్న తేడా. మేం మా సంతోషాన్ని మా విజయంలో వెతుక్కుంటాం. కానీ మీరు ఎదుటివారి కష్టాల్లో వెతుక్కుంటారు... దీనికంటే ముందు నీ దేశాన్ని బాగుచేయడంపై శ్రద్ధ పెట్టు...’ అంటూ హిందీలో ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్.. 

Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai.

— Irfan Pathan (@IrfanPathan)

పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ వేసిన ట్వీట్ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ‘దాయాదులు గెలుస్తూ ఉంటారు, కానీ వారి ఆటలో ఎందుకో నాకు గ్రేస్ కనిపించదు...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్. దీంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్, టీమిండియా ఓటమి తర్వాత భారత క్రికెటర్ల గ్రేస్ గురించి వ్యంగ్యంగా, వెటకారంగా ట్వీట్లు చేశారు. 

click me!