
2021 టీ20 ప్రపంచకప్ కి ముందు సన్నాహాకంగా సాగిన ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ లో టీమిండియా సక్సెస్ అయింది. పొట్టి ఫార్మాట్ లోనే అగ్రజట్టుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్తో ఐదు టీ20ల సిరీస్లో కోహ్లిసేన లిట్మస్ టెస్టు పాసైంది.
ఇంగ్లాండ్ను ఓడించేందుకు ఇంగ్లాండ్ పద్దతుల్లోనే పయనించి విజయం సాధించింది. రక్షణాత్మక ధోరణి గతంలో భారత్ విజయావకాశాలను దెబ్బతీసిన సందర్భాలు ఉన్నాయి. స్వదేశంలో మెగా ఈవెంట్కు ముందు టీ20ల్లో నయా అవతారం కోసం ప్రయత్నించిన భారత్ ఆ దిశగా విజయవంతమైంది.
ఇంగ్లాండ్పై ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. బౌలింగ్ విభాగంలో భారత్కు పెద్దగా బెంగ లేదు. కానీ వరల్డ్కప్లో ఆడే బ్యాటింగ్ లైనప్పై స్పష్టత లేదు. ఈ సిరీస్తో భారత్కు ఆ సమస్య కూడా లేకుండా పోయింది.
హిట్మ్యాన్ రోహిత్ శర్మ తోడుగా కెప్టెన్ విరాట్ కోహ్లి వరల్డ్కప్లోనూ ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యలకు తోడు ఇషాన్ కిషన్ రూపంలో మరో ప్రతిభావంతుడైన బ్యాట్స్మన్ అందుబాటులోకి వచ్చాడు.
శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్లు ప్రపంచకప్లో ప్రత్యామ్నాయ ఓపెనర్లుగానే ఉండనున్నారు. బ్యాటింగ్ లైనప్లో కొత్త కూర్పుతో భారత్ పూర్తిగా విధ్వంసక జట్టుగా రూపుదాల్చుకుంది. నయా అవతార్తో తొలుత ఇంగ్లాండ్పై పంజా విసిరిన కోహ్లిసేన.. ప్రపంచకప్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. టీ20 ప్రపంచకప్కు ముందు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్లు సైతం టీమ్ ఇండియా ప్రపంచకప్ సన్నద్ధతను మరింత ఉపయుక్తం కానున్నాయి.