
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15 వ సీజన్ ప్రారంభమై అప్పుడే ఐదు రోజులు గడిచిపోయాయి. పది జట్లు ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. ఇప్పుడిక రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో గత శనివారం చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ఘనంగా సీజన్ ను ప్రారంభించిన కోల్కతా నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో పోటీ పడుతున్నది. ఈ క్రమంలో టాస్ గెలిచిన డుప్లెసిస్ సేన బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు ఆహ్వానం మేరకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ బ్యాటింగ్ కు రానుంది.
డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో కేకేఆర్.. రెండో విజయాన్ని కూడా నమోదు చేయాలని భావిస్తున్నది. మరో వైపు తొలి మ్యాచులో రెండు వందలకు పైగా పరుగులు చేసినా ఓడినా బెంగళూరు కూడా ఈ మ్యాచులో తప్పకుండా గెలిచి సీజన్ లో ముందుకు కదలలాని అనుకుంటున్నది.
కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ.. బ్యాటింగ్ విషయంలో బలంగానే ఉంది. ఫాఫ్ డుప్లెసిస్ తో పాటు విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్ లు దుమ్ము దులిపే ప్రదర్శన చేశారు. వీరితో పాటు అనూజ్ రావత్, రూథర్ ఫర్డ్ లు కూడా హిట్టింగ్ కు దిగడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బౌలింగే ఆ జట్టుకు పెద్ద బ్యాక్ డ్రాప్. గత మ్యాచులో ఆర్సీబీ.. 205 పరుగులు చేసినా మ్యాచ్ గెలిపించుకోలేకపోయింది. ఆ జట్టు బౌలర్లు మహ్మద్ సిరాజ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, షాబాద్ అహ్మద్ లు భారీగా పరుగులిచ్చారు.
ఇక కేకేఆర్ తరఫున బ్యాటింగ్ విషయానికొస్తే... వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్ లు భారీ స్కోర్లకోసం చూస్తున్నారు. ఇక బౌలింగ్ లో ఆ జట్టు శివమ్ మావి స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని తీసుకుంది. గత మ్యాచులో ఉమేశ్ యాదవ్ రాణించిన విషయం తెలిసిందే.
తుది జట్లు :
కోల్కతా నైట్ రైడర్స్ : ఆజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్, రూథర్ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్