
ఐపీఎల్ లీగ్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంటూ వరుసగా ఏడో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ నుంచి దాదాపు గా నిష్క్రమించినట్టే. ప్రాక్టీకల్ గా చూస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడమనేది అద్భుతం. కానీ రోహిత్ సేనకు మాత్రం ఒక అవకాశముంది. ఇప్పటికే ఏడు మ్యాచులు ఓడిన ముంబై.. రాబోయే ప్రతి మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఏ కోశాన్నో ఉండొచ్చు అని లెక్కలేస్తున్నారు ఆ జట్టు అభిమానులు. ఈ సీజన్ లో ఆ జట్టు ఫామ్, ఆటగాళ్ల వైఫల్యాలు చూస్తే అవి కష్టమే అయినా ముంబై అభిమానుల ఆశలు మాత్రం అరేబియా సముద్రం (ముంబై దాని తీరానే ఉంది) కంటే లోతుగా ఉన్నాయి. అవేంటో మనమూ చూద్దాం.
సాధారణంగా ఏ జట్టైనా ఈ సీజన్ లో 14 మ్యాచులాడాలి. అందులో కనీసం ఎనిమిది మ్యాచులు (16 పాయింట్లు) గెలిస్తే ప్లేఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. టాప్-4లో ఉన్న నాలుగు జట్లు (ఐదో జట్టుకు కూడా సమాన పాయింట్లు ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది) ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి.
అదే కీలకం..
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 8 మ్యాచులు నెగ్గడం అనేది ముంబైకి అవకాశమే లేదు. దానికి మిగిలున్న మ్యాచులు 7. ఆ ప్రతి పోరులోనూ రోహిత్ సేన నెగ్గాలి. నెగ్గడం అంటే అదేదో ఆడాం.. గెలిచాం.. అన్నట్టు ఉండకూడదు. భారీ తేడాతో విజయాలు రావాలి. ముందు బ్యాటింగ్ చేస్తే కొండంత స్కోరు కొట్టి ప్రత్యర్థి జట్టును తక్కువకే పరిమితం చేయాలి. రెండో సారి బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడమే గాక త్వరగా విజయలక్ష్యాన్ని అందుకోవాలి. ఇలా ఒక్క మ్యాచ్ లో కాదు. ప్రతి మ్యాచ్ (ఏడింటిలో) ఇదే రిపీట్ అవ్వాలి. అలా చేస్తే 14 పాయింట్లు రావడమే గాక నెట్ రన్ రేట్ పెరుగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉన్న ముంబై నెట్ రన్ రేట్ (-0.892) దరిద్రంగా ఉంది. గెలుపుతో పాటు దానినీ పెంచుకోవాలిసిందే.
ఇంత చేసినా ఛాన్సుందా..?
వరుసగా ఏడు మ్యాచుల్లో బంపర్ విజయాలు సాధించినా ముంబైకి ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఇతర జట్ల మీద ఆధారపడి ఉంటాయి. మిగిలిన 9 జట్ల జయాపజయాల మీద ముంబై ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై మినహా మిగిలిన జట్లన్నీ మూడు విజయాలతో ఉన్నాయి. టాప్-4 లో గుజరాత్ టైటాన్స్ (5 విజయాలు.. 10 పాయింట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (5 విజయాలు.. 10 పాయింట్లు), రాజస్తాన్ రాయల్స్ (4 విజయాలు 8 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (4 విజయాలు.. 8 పాయింట్లు) ఉన్నాయి. ఐదో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (4 విజయాలు.. 8 పాయింట్లు) ఉంది.
అయితే ఈ జట్లు మిగిలిన మ్యాచ్ లు కూడా ఆడాల్సి ఉంది. కాబట్టి వీటికి ప్లేఆఫ్స్ డోకా లేదు. మరి వీటితో పాటు ఢిల్లీ, కోల్కతా, పంజాబ్, చెన్నైలను దాటుకుని ముంబై ప్లేఆఫ్స్ చేరగలదా..? ఏమో ముంబై ఇండియన్స్ అభిమానులకే తెలియాలి మరి ఆ విజయ రహస్యమేదో...
వరుసగా ఏడు ఓటములూ ఓ చెత్త రికార్డు..
ఈ సీజన్ లో ముంబై వరుసగా ఏడు ఓటములతో ఓ చెత్త రికార్డును వారి పేరిట లిఖించుకుంది. ఐపీఎల్ లో ఏ జట్టు కూడా వరుసగా ఇన్ని మ్యాచ్ లు ఓడలేదు. 2013 లో ఢిల్లీ డేర్ డెవిల్స్, 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడాయి.