ఐపీఎల్,టి20 వరల్డ్ కప్ నిర్వహణకు గవాస్కర్ సూపర్ ఐడియా!

By Sree sFirst Published Apr 24, 2020, 9:22 AM IST
Highlights

టి20 ప్రపంచ కప్ పై అనిశ్చితి నెలకొన్న వేళ, టీమిండియా మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌ (ఐపిఎల్‌)తో పాటు టి20 ప్రపంచకప్‌ను కూడా భారత్‌లోనే నిర్వహించ వచ్చని అభిప్రాయపడ్డాడు

కరోనా దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచదేశాలన్ని, ఈ మహమ్మారిపై యుద్ధం ఎలా సాగించాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నాయి. 

ప్రజల ప్రాణాలను ఈ మహమ్మారి పంజా నుండి కాపాడుకోవడానికి లాక్ డౌన్ ఒక్కటే ఏకైక మార్గం అని ఒక నిర్ణయానికి వచ్చి, ఆర్థికంగా వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నా లాక్ డౌన్ ను విధించేశాయి. 

ఈ లాక్ డౌన్ వల్ల ఇప్పటికే అన్ని క్రీడా సంరంభాలు కూడా వాయిదా పడ్డాయి. షూటింగ్ ఛాంపియన్షిప్ నుంచి ఐపీఎల్ వరకు అన్ని ఈవెంట్లు వాయిదా పడ్డాయి. నాలుగేళ్లకోసారి జరిగే విశ్వ క్రీడా సంరంభం ఒలింపిక్స్ కూడా ఈ వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 

క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ కూడా ఈ వైరస్ దెబ్బకు వాయిదాపడేలానే కనబడుతుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆస్ట్రేలియా దేశం తన అంతర్జాతీయ సరిహద్దులంన్నింటిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 

అక్టోబర్లో వరల్డ్ కప్ ఉంది. ఇంత తక్కువ సమయంలో సన్నాహక ఏర్పాట్లు జరగడం దాదాపుగా అసాధ్యం. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ కూడా వాయిదా పడ్డట్టే అని అందరూ భావిస్తున్నారు. 

ఇలా టి20 ప్రపంచ కప్ పై అనిశ్చితి నెలకొన్న వేళ, టీమిండియా మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌ (ఐపిఎల్‌)తో పాటు టి20 ప్రపంచకప్‌ను కూడా భారత్‌లోనే నిర్వహించ వచ్చని అభిప్రాయపడ్డాడు. 

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''ఆస్ట్రేలియా సెప్టెంబర్‌ 30వరకు విదేశీయులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. కానీ, అక్టోబర్‌ మూడో వారంలో టి20 ప్రపంచకప్‌ ప్రారంభంకావాల్సి ఉంది. 

ఆ కొంత సమయంలో టోర్నీ ఏర్పాట్లు చేయడం సులభం కాదు. వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వ నుంది. కాబట్టి.. భారత్‌, ఆస్ట్రేలియా ఒక ఒప్పందం చేసుకొని.. టోర్నమెం ట్‌ను ఈ ఏడాది భారత్‌లో.. వచ్చే ఏడాది ఆస్ట్రేలి యాలో నిర్వహిస్తే బాగుంటుంది. 

అదే జరిగితే.. ఈ టోర్నీకి కొన్ని వారాల ముందు ఐపిఎల్‌ పెడితే.. అది ప్రపంచకప్‌కి ప్రాక్టీస్‌లా ఉంటుంది'' అని గవాస్కర్‌ తెలిపాడు. ఈపాటికే ఇదే విషయాన్నీ చాలా మంది విశ్లేషకులు, సీనియర్లు సైతం బయటపెట్టారు. ఆస్ట్రేలియా భారత్ ను అడిగితే, బీసీసీఐ ఒప్పుకుంటే భారత్ లో ఈ సారి టి20 డబల్ డోస్ అన్నమాట!

click me!